మోక్ష మార్గం..ఉత్తర ద్వార దర్శనం: వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలంటే!
తిరుపతి: గురువారం వైకుంఠ ఏకాదశి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తుల కోలాహలంతో నిండిపోయే ప్రత్యేక సందర్భం. ముక్కోటి దేవతలు, సప్తర్షులు విష్ణు సహస్ర నామాలతో శ్రీమన్నారాయణుడిని పూజించే అత్యంత పవిత్రమైన రోజు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన ఆంక్షల మధ్య ఈ సంవత్సరం కూడా ఈ పెద్ద పండగను జరుపుకోవాల్సి వస్తోంది. ఆలయాలను సందర్శించడానికి వచ్చే భక్తుల కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
సూర్య భగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్నే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు గరుడ వాహనరూఢుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోక సంచారానికి వస్తాడని, భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండగకు ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఏ పేరున పిలుచుకున్నా ఆ శ్రీమన్నారాయణుడు ఎలా భక్తులను కరుణిస్తాడో.. అదే విధంగా ఏ పేరుతో ఈ పండగను జరుపుకొన్నా దాని ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

శ్రీమన్నారాయణుడు కొలువు ఉండే నివాసం.. వైకుంఠం. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు, సప్తర్షులు ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలోనికి ప్రవేశిస్తారని, లక్షీ సమేతుడైన శ్రీహరిని వేనోళ్ల కొనియాడుతూ, విష్ణు సహస్ర నామాలతో పూజిస్తారని ప్రతీతి. ఆ రోజున తనువు చాలించిన వారుగా స్వర్గానికి వెళ్తారనీ, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించితే- మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి తిథి బుధవారం నాడు సాయంత్రం 4:49 నిమిషాలకు ఆరంభమౌతుంది. మరుసటి రోజు సాయంత్రం 7:32 నిమిషాల వరకు ఉంటుంది. ఈ పర్వదినం నాడు ఉపవాసం ఉండదలిచిన భక్తులు గురువారం నాటి ఉదయం 7:15 నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే శుక్రవారం ద్వాదశి నాడు ఉదయం 9:28 నిమిషాల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఉపవాసాన్ని విరమించాలి. ఏకాదశి వ్రతాన్ని చేయడానికి ఇంతకంటే శ్రేష్ఠమైన రోజు మరొకటి ఉండదని పెద్దలు చెబుతుంటారు.
ఏకాదశి వ్రతాన్ని పాటించదలిచిన వారు వీలైనంత ఎక్కువగా దాన, ధర్మాలు చేయాలి. స్వయం పాకం మంచిది. ఆహారంగా పండ్లను మాత్రమే స్వీకరించాలి. ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తరువాతే దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ద్వాదశి నాడు గోపూజ చేయాలి. విష్ణు సహస్ర నామాలను జపిస్తూ ఉండాలి. నదీస్నానం, ఆలయ దర్శనంతో ఆ రోజంతా గడపాలని పెద్దలు చెబుతుంటారు.












Click it and Unblock the Notifications