వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వజ్ఞాని ఆది శంకరాచార్యుల జయంతి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

విశ్వకర్మ సమారంభాం శంకరాచార్యమధ్యమామ్‌
అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరామ్‌ .

ఆనాటి సమకాలీన హిందూమత ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలిచేవారు, హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరాచార్యులు 'అద్వైత' సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు క్రీ.శ. 788 సంవత్సరంలో కేరళా రాష్ట్రంలో 'కాలడి' అనే గ్రామంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున శ్రీమతి ఆర్యాంబ, తండ్రి బ్రహ్మశ్రీ శివగురుదేవులనే విశ్వాబ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించి క్రీ.శ 820 సంవత్సరంలో శివైక్యం పొందారు.

బాల్యము:- శంకరాచార్యుల చిన్న వయస్సులోనే తండ్రి మరణించాడు. తన తల్లి కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరాచార్యులు ఏకసంథాగ్రాహి, బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరాచార్యులు ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం దాచుకున్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరాచార్యులు ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది. ఒకరోజు శంకరాచార్యుల తల్లి పూర్ణానది నుండి నీళ్ళను మోసుకువస్తుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరాచార్యులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారే సరికి గ్రామ ప్రజలు శంకరాచార్యులు తల్లి కొరకు చేసిన పనికి ఆశ్చర్య పోయారు.

 adi shankaracharya birth anniversary celebrations

సన్యాస స్వీకారము:- సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరాచార్యులు తన తల్లి అనుమతి కోరాడు. కొడుకు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరాచార్యులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి పట్టుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన మనోభిష్టం నేరవేరకముందే జీవితం ముగుస్తుందని ఆవేదనలో ఆ చివరి క్షణంలోనైనా సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లితో ప్రాదేయపడ్డాడు. అప్పుడు ఆమె అంగీకరించింది. తక్షణమే సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరాచార్యులను వదిలేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే ఆలోచనతో తన తల్లి అనుమతి కోరి తల్లికి ఈ విధంగా మాట ఇచ్చాడు "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే నీవద్దకు వస్తాను" అని శంకరాచార్యులు తల్లికి చెప్పాడు.

గోవింద భగవత్పాదుల దర్శనం :- తల్లి అంగీకారం తీసుకుని శంకరాచార్యులు తన ఊరు కాలడిని విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళాడు. నర్మద నది ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం కలిగింది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరాచార్యులు అడవుల నుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చేయగా గోవింద భగవత్పాదులు 'ఎవరు నువ్వు?' అని అడిగారు. శంకరాచార్యులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం

నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని. ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరాచార్యులను చూసిన గోవింద భగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి ఈ విధంగా అన్నారు.

"స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరాచార్యులు)

శంకరాచార్యులు మొట్ట మొదటిగా గోవింద పాదులకు పాదపూజ చేసాడు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని, సర్వ ప్రపంచానికి వెల్లడి చేసాడు. గోవిందపాదులు శంకరాచార్యుల బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించాడు. ఒకరోజు నర్మదా నది వరద వచ్చి పొంగి పొర్లుతూ గోవిందపాదుల తపస్సుకు భంగం కలిగిస్తుండగా శంకరాచార్యులు తన శక్తితో నది అలజడిని నిరోధించాడు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తైన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నాడు.

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః

దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన సనాతన ధర్మపరిరక్షణ కొరకు సాక్షాత్తు పరమ శివుడే కలియుగంలో శంకరాచార్యులు రూపంలో జన్మించాడని మన పెద్దలు చెబుతుంటారు. దేశంలో బౌద్ధం, శాక్తేయం, చార్వాక వాదం ప్రభలంగా ఉన్న కాలంలో శంకరాచార్యులు వారందరిని ఎదిరించి మానవునికి అద్వైతం ఒక్కటే జీవిత మార్గమని చాటి చెప్పినాడు. తన 32 ఏటనే 72 మతాల వారితో మేధో పోరాటములు చేసి చివరకు కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠమును తన ప్రతిభతో అధిష్టించిన మహా మేధావి శంకరాచార్యులు.

'అహం బ్రహ్మస్మి' అను వేద సారమునకు అనుగుణంగా 200 గ్రంధాలను మూడు విభాగాలలో రచనలు చేసి సమాజానికి అందించి గొప్ప సంఘ సంస్కర్త శ్రీ శంకరాచార్యులు. దేశ పర్యటనలో భాగంగా ఒకనాడు తిరువాన్కూరు నుండి ప్రయాణమై మచిలీపట్నం చేరుకొని అక్కడ బస చేసారు. కొంత విశ్రాంతి తీసుకున్న తరవాత గురువు శ్రీ శంకరాచార్యులు తమ ఊరికి వచ్చాడని తెలుసుకున్న భక్తులు వీరిని కలవడం కొరకు వచ్చారు. అందరిని ప్రేమగా పలకరిస్తూ, భక్తులకున్న సందేహాలను వివరించే క్రమంలో గురువుగారు మీకు ఈ జగద్గురువు అనే బిరుదు ఎలా ప్రాప్తమైనది అని అడుగగా అందుకు శంకరాచార్యులు

శ్లో . ఆచార్య శంకరోనామ! త్వష్టపుత్రో నసంశయI
విప్రకుల గురోర్దిక్షా ! విశ్వకర్మంతు బ్రాహ్మణ II

అని సమాధానం చెప్పారు. ఈ శ్లోకానికి అర్ధం ఏమనగా నా పేరు శంకరాచార్యులు, నేను విశ్వబ్రాహ్మణ వంశంలో త్వష్ట బ్రహ్మ సంతతికి చెందిన వాడను, విప్రులకు గురువునై ఉపదేశము చేయుదును, అని చెబుతూ నేను విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుడను అని సు స్పష్టంగా తెలియజేసారు శంకరాచార్యులు. శంకరాచార్యులు బ్రహ్మణుడు కాదు విశ్వ బ్రాహ్మణుడు అని నిరూపణ చేసిన పరిశోధకులు ఉన్నారు. క్రీ.శ 1909 వ సంవత్సరంలో 'ఆల్ ఫర్డ్ ఎడ్వర్డ్' వ్రాసిన గ్రంధం " విశ్వాబ్రాహ్మణ & హిజ్ డిసిడెంట్స్ ( విశ్వాబ్రాహ్మణ ఆయన సంతతి ) అనే గ్రంధంలో "జగద్గురు" అనే నామం ( పేరు ) కేవలం విశ్వబ్రాహ్మాణులకు మాత్రమే పరిమితం అని కరాకండిగా చెప్పినారు.

ఇదే గాక 'విన్ సోస్' అనే డిక్షనరిలో ఉన్నదాని ప్రకారం కూడా 'జగద్గురు' అనే బిరుదు నామము ప్రపంచములో కేవలం విశ్వ బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమని తెలియజేయుచున్నది. జగద్గురువు శ్రీ శంకరాచార్యులు వారు అద్వైత ప్రచారం కోసం దేశ వ్యాప్త పర్యటనలు జరిపి శృంగేరి పీఠము, ద్వారక పీఠము, పూరీ పీఠము, కంచి పీఠము అని ఇలా దేశానికి నాలుగు దికులలో నాలుగు పీఠాలను స్థాపించి శ్రీ కంచి కామకోటి పీఠానికి స్వయంగా తానే పీఠాధిపతిగా వ్యవహరించారు. వీరి తర్వత కాలంలో కొంత కాలం వరకు విశ్వబ్రాహ్మణులే "ఆచార్య స్వామి" అనే బిరుదు నామముతో కొనసాగారు. బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను, ఉపనిషత్తులను వ్యాఖ్యానించి లోకానికి అందించి సనాతన ధర్మాన్ని కాపాడటానికి అవతరించిన మహాపురుషుడు శంకరాచార్యులు.

ప్రస్థానత్రయం :-
శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో పండిత గోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణు సహస్రనామ స్తోత్రము, "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.

హిందూ మతంపై శంకరాచార్యులు సాధించిన ప్రధాన విజయాలు:-

బౌద్ధమత ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో ( భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశ దేశాలలో పండితులతో వాదనలు సాగించి వారిని ఒప్పించి, నెగ్గి, శంకరాచార్యులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి. గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. శంకరాచార్యులు అనేక గ్రంథాలు రచించారు.

శంకరాచార్యులు జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని శంకరాచార్యుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి, అందుకే ఆది శంకరాచార్యులు జగద్గురువు అయ్యాడు.

English summary
adi shankaracharya birth anniversary celebrations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X