ప్రయాగ్రాజ్ కుంభమేళా: ప్రారంభం ఎప్పుడంటే, కుంబమేళా గురించి మరిన్ని అంశాలు
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
జనవరి 15 వతేదీ నుండి ప్రయాగరాజ్ లో జరిగే కుంభమేళా గురించి , దాని ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాము.
దక్షిణాదిన మనందరకూ పుష్కరాలు , పుష్కరస్నానాలు, ఏయేనదులలో ఎప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసు కానీ ఈ కుంభస్నానాలనేవి కేవలం ఉత్తరదేశపు తీర్థాలకే సొంతం.
ఈ కుంభస్నానాలు #ప్రయాగ, #ఉజ్జయిని, #నాసిక్ మరియు #హరిద్వార్ లలో జరుగుతాయి.
మనవైపు పుష్కరాలు గురుగ్రహం యొక్క సంచారం లో ఒక్కొక్క రాశి ప్రవేశంతో ప్రారంభమౌతాయి. 12రోజుల వరకూ కొనసాగుతాయి. అయితే ఈ కుంభస్నానాలు పైన పేర్కొన్న 4 చోట్ల ఖగోళీయ గ్రహగతుల ఆధారంగా ప్రారంభమౌతాయి.
పుష్కరస్నానాలకు గురుచారం ఒకటే ప్రాతిపదిక అయితే , ఈ కుంభ స్నానాలకు గురుచారంతోబాటు రవి,చంద్రుల సంచారం కూడా ప్రాతిపదికగా తీసుకుని స్నానతేదీలను నిర్ణయిస్తారు.
ప్రయాగలో కుంభస్నాన నిర్ణయం:
మేషరాశింగతే జీవే మకరే చంద్రభాస్కరౌ ।
అమావాస్యా తదాయోగః కుంభాఖ్యస్తీర్థనాయకే ।।
- స్కందపురాణం.
"గురుడు మేషరాశిలో ఉండి రవి,చంద్రులు మకరరాశిలో ఉన్నపుడు అమావాస్య నాడు కుంభయోగం ఏర్పడుతుంది."
అలా ఏర్పడిన తరువాత, #మకరసంక్రమణం నాడు మొదటి #షాహీస్నాన్ తో కుంభస్నానాలు ప్రారంభమౌతాయి.
పై గ్రహస్థితి ప్రకారం 2013 న జనవరి 14 న మకర సంక్రమణం నాడు ప్రయాగలో కుంభమేళా ప్రారంభమైంది.
అయితే మరి ఇప్పుడు ఏమిటి?
ఇది అర్ధకుంభ్ . ప్రధాన కుంభమేళా 12 సం.కు ఒకసారి వస్తుంది. మధ్యలో 6 సం.కు ఒకసారి అర్ధకుంభ్ ని నిర్వహించాలని కొన్ని శతాబ్దాలక్రితమే సాధు-సంత్ ల మండలి నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ అర్ధకుంభ్ కేవలం ప్రయాగ, హరిద్వార్ లలో మాత్రమే జరుగుతుంది. ఆయాచోట్ల ప్రధాన కుంభయోగానికి సరిగ్గా 6 సం.కు అర్ధకుంభ్ జరుపుతారు. అందువలన 2013 లో కుంభ్ జరిగాక , 2019 లో అర్ధకుంభ్ జరుగుతోంది.
అర్ధకుంభ్ నకు ఖగోళ గ్రహగతులతో సంబంధం లేదు. ప్రధాన కుంభమేళా జరిగాక 6 సంవత్సరాలవ్వాలి అంతే.

కుంభమేళా పౌరాణిక ప్రాశస్త్యం
స్కందపురాణంలో దీనివర్ణన ఉంది. మనకు దేవదానవుల క్షీర సాగర మథనం కథ తెలుసు కదా!
అపుడు ఉద్భవించిన అమృతం కోసం దేవదానవుల నడుమ 12 రోజులపాటు యుద్ధం జరిగింది.
దేవతలకు 12 రోజులంటే మానవులకు 12 సంవత్సరములే కదా! కుంభ పర్వాలు కూడా 12 ఉన్నాయి. అయితే మానవులకు 4 , దేవతలకు 8 కేటాయించడం జరిగింది. అందువలన భూమిపై 4 , దేవలోకంలో 8 కుంభపర్వాలు జరుగుతాయని స్కందపురాణవచనం.
దేవ దానవ సంగ్రామ సమయంలో అమృత కుంభాన్ని సూర్య,చంద్రులు, గురుడు, శని రక్షించారు. చంద్రుడు కలశం నుండి అమృతం బయటకు ఒలకకుండా కాపాడితే , సూర్యుడు కలశం పగిలిపోకుండా చూసుకున్నాడట. గురుడు కలశాన్ని రాక్షసుల నుండి కాపాడితే , శనైశ్చరుడు ఇంద్రుని నుండి కలశాన్ని కాపాడాడని స్కందపురాణం ఇలా తెలియజేస్తుంది
" చంద్రః ప్రస్రవణాద్రక్షాం సూర్యో విస్ఫోటనాద్దధౌ ।
దైత్యేభ్యశ్చ గురూ రక్షాం శౌరిదేవేంద్రజాద్భయాత్।।"
ఏ సమయంలో ఈ గ్రహాలు కలశాన్ని రక్షించాయో అప్పటి గ్రహస్థితికి అనుగుణంగా వర్తమాన గ్రహస్థితులలోకి ఆయా గ్రహాలు వచ్చినప్పుడు కుంభ యోగం ఏర్పడుతుంది.
అయితే ఆ అమృత కుంభం నుండి కొన్ని అమృత బిందువులు తుళ్ళి నాలుగుచోట్ల పడ్డాయనీ అందువలన అవి పడిన నాలుగుచోట్ల ప్రయాగ,ఉజ్జయిని,నాసిక్ మరియు హరిద్వార్ లలో కుంభమేళా జరుగుతుందని స్కందపురాణం అంటోంది.
" విష్ణుద్వారే తీర్థరాజేఽవన్త్యాం గోదావరీతటే।
సుధాబిందువినిక్షేపాత్ కుంభపర్వేతి విశ్రుతమ్।।"
ప్రయాగ స్నాన మాహాత్మ్యం:
మామూలు రోజులలోనే ప్రయాగలో స్నానానికి ఎంతో ప్రాధాన్యతని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక కుంభ యోగంలో చెప్పేదేముంది?
"అశ్వమేధ సహస్రాణి వాజపేయశతాని చ।
లక్షం ప్రదక్షిణా భూమేః కుంభస్నానేన తత్ఫలమ్।।"
"వెయ్యి అశ్వమేధ యాగాలు, వంద వాజపేయ యాగాలు, లక్షసార్లు భూ ప్రదక్షిణలు చేస్తే ఎంత ఫలితమో
కుంభ స్నానం ప్రయాగలో చేస్తే అంత ఫలితమని విష్ణుపురాణ వచనం.
సహస్రం కార్తికే స్నానం మాఘే స్నానశతానిచ।
వైశాఖే నర్మదాకోటిః కుంభస్నానేన తత్ఫలమ్।।"
వెయ్యి కార్తీక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం వంద మాఘ మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం వైశాఖ మాస స్నానాలు కోటి మారులు నర్మదా నదిలో చేసిన ఫలితాన్ని ఒక్కమారు కుంభ స్నానంతో మానవుడు పొందుతాడని స్కందపురాణవచనం.
గ్రహాలలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు ఎలా శ్రేష్ఠమో, తీర్థాలలో ప్రయాగ అలా శ్రేష్ఠమని పద్మపురాణవచనం.
ప్రయాగలోని అక్షయ వట దర్శనం చేస్తే బ్రహ్మహత్యాది పాతకనాశనం అవుతుందని కూడా పద్మపురాణం తెలుపుతోంది.
ప్రయాగ తీర్థాన్ని 60వేల ధనుర్ధారులు గంగానదిని సూర్య భగవానుడు యమునా నదిని ఇంద్రుడు ప్రయాగ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారని మత్స్యపురాణవచనం.
మాఘమాసంలో త్రివేణీ సంగమ స్నానం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నారద పురాణ వచనం.
అందువలన వీలు చేసుకుని , పుణ్యాభిలాషులమై , దురితక్షయాన్ని కాంక్షిస్తూ ప్రయాగరాజ్ లో స్నానం ఆచరించి సాధుదర్శనం చేసుకుని తరిద్దాం.












Click it and Unblock the Notifications