తొలి ఏకాదశి పవర్, ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది!
పాపాలను ప్రక్షాళన చేసి, సర్వ శుభాలను ప్రసాదించే పవిత్రమైన పండుగల్లో 'తొలి ఏకాదశి' అత్యంత ప్రాముఖ్యమైనది. ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశినే 'శయని ఏకాదశి', 'ఆషాఢ ఏకాదశి' అని కూడా పిలుస్తారు. చాతుర్మాస్య వ్రతానికి పునాది వేసే ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా విష్ణు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతాయి. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఉన్న విశేష ప్రాముఖ్యత, ఈ రోజున ఏ దేవుడిని ఆరాధించాలి, సాంప్రదాయంగా ఆరగించే పేలాల పిండి వెనుక ఉన్న ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం!
పురాణాల ప్రకారం.. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోనికి వెళ్తాడు. ఈ రోజే 'చాతుర్మాస్య వ్రతం' ప్రారంభమవుతుంది. వరుసగా నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. స్వామివారు నిద్రించే ఈ కాలంలో భక్తులు జపాలు, తపస్సులు, ఏకాదశి ఉపవాస వ్రతాలు ఆచరించడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతతతో పాటు భగవంతుని అపారమైన కృప లభిస్తుందని నమ్ముతారు.

ఈ రోజున విష్ణువును పూజించాలా? శివుడిని పూజించాలా?
తొలి ఏకాదశి అనగానే చాలామందిలో వచ్చే సందేహం.. ఈ రోజు శ్రీమహావిష్ణువును ఆరాధించాలా లేక పరమశివుడిని పూజించాలా అని! హిందూ ధర్మం ప్రకారం హరి (విష్ణువు), హర (శివుడు) ఇద్దరూ ఒక్కటే. ముఖ్యంగా తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తి క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి, ఈ రోజున శ్రీమహావిష్ణువును, శ్రీలక్ష్మీదేవిని, శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా అర్చించడం మహా పుణ్యఫలాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ, తులసి దళాలతో పూజలు చేస్తారు.
విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండే నాలుగు నెలల కాలంలో విశ్వ పరిపాలన బాధ్యతలను పరమశివుడు పర్యవేక్షిస్తాడని పురాణాలు చెబుతాయి. పైగా ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శివారాధనకు కూడా ఇది ఎంతో పవిత్రమైన సమయం. తొలి ఏకాదశి రోజున విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తూనే, శివుడిని కూడా దర్శించుకోవడం ద్వారా హరిహరుల అనుగ్రహం లభిస్తుంది.
తొలి ఏకాదశి నాడు 'పేలాల పిండి' ఎందుకు తింటారు?
తొలి ఏకాదశి ప్రత్యేకం అనగానే ప్రతి ఇంట్లో గుర్తుకువచ్చేది 'పేలాల పిండి'. జొన్నలు లేదా వరి పేలాలను వేయించి, దానికి బెల్లం, యాలకులు, మిరియాలు, సొంటి పొడి కలిపి పేలాల పిండి తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
ఆరోగ్య సూత్రం
ఆషాఢ మాసంతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వచ్చి శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వర్షాల వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు రావడం సహజం. పేలాల పిండిలో వాడే బెల్లం, మిరియాలు, సొంటి శరీరంలో వేడిని పుట్టించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
తొలి ఏకాదశి రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు:
- ఉపవాస వ్రతం: తొలి ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండటం శ్రేష్ఠం. ఉపవాసం ఉండలేని వారు సాత్వికాహారం తీసుకోవచ్చు.
- జాగరణ: ఏకాదశి రాత్రి విష్ణు సహస్రనామ స్మరణ, భజనలతో జాగరణ చేయడం వల్ల సర్వపాపాలు నశిస్తాయని నమ్ముతారు.
- ధానధర్మాలు: ఈ రోజున శక్తి కొలదీ పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.
- తులసి పూజ: విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన తులసి మొక్కకు పూజ చేసి, ప్రసాదంలో తులసి దళాలను ఉంచి నివేదించాలి.
ఈ పవిత్ర తొలి ఏకాదశి పర్వదినం మీ కుటుంబంలో సకల సౌఖ్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ... అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు!












Click it and Unblock the Notifications