Must Read:పోషణ సామర్థ్యం లేనివారికి వివాహం అనవసరం
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఒకగ్రామంలో ఒక తల్లి కొడుకు, కోడలితో నివసించేది. ఆమె కొడుకు పెద్దవాడయినా, ఏసంపాదనా లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఎక్కడ తిరిగినా భోజనంవేళకు మాత్రం యింటికి వచ్చేవాడు. రోజూ తల్లి వాడికి అన్నం పెడుతూ నాయనా! ఈ చద్ది అన్నం తిను అంటూ ఉండేది. వేడివేడి అన్నం పెడుతూ, తల్లి రోజూ అలా ఎందుకు అనేదో కుమారునికి అర్థం అయ్యేది కాదు.
ఒకరోజు తల్లి యేదోపనిమీద బయటకు వెడుతూ కోడలికి వంట చెయ్యమని చెప్పింది. కొడుక్కు అన్నం పెడుతున్నప్పుడు మాత్రం చద్ది అన్నం తినమని చెప్పటం మర్చిపోవద్దని మరీమరీ హెచ్చరించింది.
కోడలు తన భర్తకు అన్నం వడ్డించి, అతను తినబోయేముందు చద్ది అన్నం తినండి అంది. దానితో అతనికి చాలా కోపం వచ్చింది. అన్నం కూరలు అన్నీ వేడివేడిగా ఉన్నాయి కదా. మా అమ్మలానే నువ్వు కూడా చద్దిఅన్నం తినమంటావేమిటి? అని భార్యను కోపగించుకున్నాడు. ఆ అమ్మాయి బిక్కమొహం వేసుకొని అత్తగారు నన్ను తప్పకుండా యిలా అనమన్నారు అని సమాధానం యిచ్చింది. అతడు కోపంతో అన్నం తిననే లేదు. తల్లి యింటికి తిరిగివచ్చి నాయనా! అన్నం తిన్నావా? అని కుమారుణ్ణి ఆపేక్షగా అడిగింది. అతడు చిరాగ్గా అమ్మా! రోజు నువ్వు వేడి అన్నం వడ్డించి, చద్దన్నం తినమని చెప్తుంటావు. ఇవాళ నీ కోడలు కూడా అలానే అంది. వేడివేడి అన్నం కూరలు చద్దివి ఎలా అవుతాయి? అన్నాడు.
తల్లి చద్దన్నం అంటే ఏమిటి ? అని ప్రశ్నించింది. ఉదయం వండిన అన్నం రాత్రికి చల్లబడుతుంది. ఈ రోజు వండిన అన్నం రేపటికి చద్ది అన్నం అవుతుంది. ఇప్పుడే వండినది వేడి అన్నం అవుతుంది అని సమాధానమిచ్చాడు. ఇప్పుడు నువ్వే ఆలోచించి చూడు. నువ్వు మీ నాన్నగారు సంపాదించి నిల్వచేసిన దానినేగా తింటున్నావు. అందుకే దాన్ని చద్దన్నం అంటున్నాను. నువ్వు కష్టపడి సంపాదించిన దానితో తినేతిండి వేడివేడి అన్నంతో సమానం అవుతుంది. అర్థమయ్యిందా! అని తల్లి కుమారునికి వివరించి చెప్పింది. అప్పుడు అతడు తన తప్పుకు పశ్చాత్తాపపడి, యికపై కష్టపడి సంపాదించిన దానితోటే తృప్తిగా తింటానని తల్లికి వాగ్దానం చేశాడు.
ఈ కథలోని నీతి ఏమిటంటే ఎవరి రెక్కలకష్టం మీద వారు బ్రతకాలి. పెళ్ళయినవాడు తన సంపాదనతో కుటుంబ పోషణ చెయ్యాలి. అంతేగాని పూర్వులు సంపాదించినదానిని తినడం మొదలుపెడితే 'కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి' అన్న చందాన తయారవుతుంది.
రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తే, శ్రీరాముడు భరతుని తనకు సహాయం చేయమని అడగలేదు. ఎందుకంటే తన భార్య పోషణ, రక్షణ తన కర్తవ్యమని రాముడికి బాగా తెలుసు. అందుచేతనే రాముడు తన బుద్ధి, భుజ బలాలతో సుగ్రీవుడికి సహాయం చేసి తిరిగి అతడి నుండి ప్రత్యుపకారాన్ని పొందాడు. సుగ్రీవుడికి అధికారం, సంపద, రాజ్యం, స్త్రీ అనే నాల్గింటిని యిచ్చి తను మాత్రం సీత ఒక్కదానికోసమే సహాయాన్ని పొందాడు. ఈ దృష్టాంతం వలన తెలిసేదేమంటే కుటుంబాన్ని పోషించగలవాడు, రక్షించగలవాడు మాత్రమే వివాహం చేసుకోవాలి. ఈ సామర్థ్యం లేనివారికి వివాహం అనవసరం.