సిద్ధరామయ్యకు కీలక పదవి.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్యకు కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
మరోవైపు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా తప్పుకున్న సీనియర్ నేత సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ సముచిత స్థానం కల్పించిందని పార్టీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఇక సిద్ధరామయ్య కర్ణాటకకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మొదటిసారి 2013 నుంచి 2018 వరకు అలాగే రెండోసారి మే 2023 నుంచి మే 2026 వరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో మాజీ సీఎం దేవరాజ్ అరస్ పేరిట ఉన్న రికార్డును సిద్ధరామయ్య అధిగమించారు. అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నాయకుడిగా సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించారు.












Click it and Unblock the Notifications