ఆదర్శజిల్లాలో బాబు హడావుడి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు జరిపిన సుడిగాలి పర్యటన ఆద్యంతం హడావుడిని సృష్టించింది. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తూ, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ అధికారులు, పార్టీ వర్గాలను ఆయన ఉరుకులు పరుగులు పెట్టించారు.
జిల్లాలో సుమారు 229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆదిలాబాద్ను దేశంలోనే ప్రధమశ్రేణి హార్టికల్చర్ జిల్లాగా తీర్చిదిద్దనున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ జిల్లా పర్యటనలో సింగరేణి సమ్మెను కూడా ఆయన ప్రస్తావించారు. అప్పుల్లో కూరుకుపోయి బిఐఎఫ్ఆర్ కేసుగా వున్న సింగరేణికి కేంద్రంతో మాట్లాడి 600 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేయించినట్టుగా ఆయన చెప్పారు.
సింగరేణిని కాపాడుకోవాలని దానిని నష్టాలపాలు చేయవద్దని కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంచిర్యాలలో ఆయన 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ఆసిఫాబాద్ మండలంలో పెద్దవాగుపై ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి దానికి కొమురం భీమ్ పేరుపెడుతున్నట్టుగా ప్రకటించారు. ఝరి గ్రామంలో మూడు కోట్ల ఖర్చు తో నిర్మిస్తున్న రిజర్వాయర్కు ఆయన శంకుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications