AP Govt: ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన..!
ఏపీలో ఎప్పటిలాగే జూలై నెల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం (AP Govt) ముందస్తుగానే నిధులు విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తోంది. ఈసారి కూడా ఆ విధంగానే మొత్తం రూ.2711.79 కోట్ల నిధుల్ని జూలై నెల పెన్షన్ల కోసం విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,19,648 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,711.79 కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు (Spouse Pensions) జూలై 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ. 3.12 కోట్లను విడుదల చేసినట్టు కూడా మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకుని రూ. 68,598.44 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తోందని మంత్రి కొండపల్లి వెల్లడించారు. తాజాగా వితంతు పెన్షన్లను కూడా ఇస్తున్న ప్రభుత్వం, ఇతర కొత్త పెన్షన్లపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది.













Click it and Unblock the Notifications