బాబు మదిలో మంత్రివర్గ మార్పులు
హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమకు ముఖ్యమంత్రి సూచన చేసినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు పూర్తయ్యే సరికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయడం మంచిదని ముఖ్యమంత్రి ఒక సమావేశంలో అన్నట్లు చెబుతున్నారు. కార్పోరేషన్ల పదవులను కూడా అప్పుడే భర్తీ చేయాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలోని ఆర్టీసి, టిటిడి వంటి దాదాపు 15 కార్పోరేషన్ల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి వుంది. పోస్టుల భర్తీకి పార్టీ కార్యాలయం ఒక జాబితాను కూడా ఖరారు చేసింది. అయితే, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారిక నియామకాలకు బ్రేక్ పడింది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి టి. దేవేందర్ గౌడ్, పార్టీ నాయకులు లాల్ జాన్ బాష, రావుల చంద్రశేఖర్ రెడ్డి, తదితరులతో సమావేశమై కార్పోరేషన్ పదవుల భర్తీపై కొద్ది సేపు చర్చించారు.