మణిపూర్లో చల్లారని మంటలు
ఇంఫాల్: మణిపూర్లో మంటలు ఇంకా చల్లారలేదు. మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ ఇచ్చిన అల్టిమేటం దరిమిలా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేసే విషయంపై ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి తరుణ్గొగొయ్తో ప్రధాని వాజ్పేయ బుధవారం నాడు ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
కేంద్రమంత్రి చౌబాసింగ్ కూడా ప్రధానిని కలసి మణిపూర్ పరిస్థితిని వివరించారు. కాల్పుల విరమణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు. కాగా గ్రేటర్ నాగాలాండ్ భయాలు అర్ధరహితమని ఈశాన్య భారతంలోని ఏ రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతకూ భంగం కలిగించే సమస్యే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా వుండగా నిరవధిక కర్ఫ్యూ వల్ల ఇంఫాల్తో పాటు అల్లర్లతాకిడి గురైన ప్రాంతాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. భారీ ఎత్తున కేంద్ర బలగాలను మొహరించారు. కేంద్ర బలగాల కవాతుతో ప్రజలు వీధుల్లోకి రావడానికి జంకుతున్నారు.