సిఫీ నుంచి మరో బి2బి మార్కెట్
చెన్నై:మాంద్యం గురించిన చర్చల మాట ఎలా వున్నా సత్యం కంప్యూటర్స్ గ్రూప్ సంస్ధ సిఫీ ఇన్ఫో వే మాత్రం తన కార్యకలాపాలను యథప్రకారం ముందుకు తీసుకుని పోతునే వుంది. ప్రపంచవ్యాప్తంగా ఇ-మార్కెట్లకు విస్తృతవేదికగా వెబ్ ఎక్స్చేంజ్ పేరిట ప్రత్యేక అనుబంధ సంస్థను సిఫీ ప్రారంభించింది.
తాజాగా వెబ్ ఎక్స్చేంజెస్ సంస్థ ఎక్స్పోర్ట్స్వెబ్ఎక్స్డాట్కామ్ను ప్రారంభించింది. భారతీయ ఎగుమతిదారులను విదేశీ కస్టమర్లతో అనుసంధానించడానికి ఈ బి2బి వెబ్సైట్ను ప్రారంభించినట్టుగా సిఫీ చెబుతున్నది. అమెరికాకు చెందిన బి2బి ఇ-కామ్ కంపెనీ మీట్ వరల్డ్ ట్రేడ్తో కలసి సంయుక్తంగా ఈ వెబ్ఎక్స్చేంజ్ను ప్రమోట్ చేశారు.
కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, వైద్యం, ఆరోగ్యం, రసాయనాలు, ప్లాస్టిక్స్, బొమ్మలు, వజ్రాలు రత్నాలు వంటి వాటితో సహా మొత్తం 12 విభాగాల్లోని ఎగుమతులపై దృష్టి నిలపాలని వెబ్ఎక్స్చైంజ్ ఆలోచిస్తున్నది. దేశంలో మొత్తం లక్ష మందికి పైగా రిజిస్టర్డ్ ఎగుమతిదారులు వున్నారని వారిలో కనీసం 4,5 వేలమందిని తమ ఎక్స్చేంజ్ ద్వారా కార్యకలాపాల నిర్వహణకు సబ్స్క్రయిబ్ చేయించగలమని సిఫీ వర్గాలు ధీమాతో వున్నాయి. ఈ ఎగుమతి సంస్థలు వెబ్లో వుంచే కంటెంట్ ఆధారంగా సబ్స్క్రిప్షన్ ఫీజు కింద 5000 నుంచి 30000 రూపాయల వరకు వసూలు చేస్తారు.