బందీలలో ముగ్గుర్ని చంపిన నక్సల్స్
హైదరాబాద్ః వెన్నుపోటు దారులనే ముద్రతో ఆరుగురిని కిడ్నాప్ చేసినపీపుల్స్ వార్ బుధవారం నాడు వారిలో ముగ్గురిని హత్య చేసింది. ఇద్దరిని తీవ్రంగా కొట్టి విడుదల చేసింది. వార్ చెరలో మరొకరు బందీగా వున్నారు.పీపుల్స్ వార్ చేతిలో దెబ్బలుతిని ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.
సోమ మంగళ బుధ వారాలలో వార్ నక్సలైటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచి ఆరుగురిని ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్నారనే ఆరోపణపై బందీలుగా తీసుకు వెళ్ళారు. వారిలో ముగ్గురిని చంపి బుధవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కంచిలపల్లి సరిహద్దులో పడవేశారు. మరణించిన వారని దేవయ్య, స్వామి, విజయ్ గా పోలీసులు గుర్తించారు.
పీపుల్స్ వార్ కిడ్నాప్ ల పర్వంతో నిజామాబాద్, కరీంనగర్ సరిహద్దు జిల్లాల గ్రామప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ నక్సల్స్ తమ కార్యకలాపాలు యధేఛ్ఛగా నిర్వహిస్తున్నారు.