మరో 500 కోట్లతో టాటా టెలీ విస్తరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో బేసిక్ టెలీకామ్ సర్వీసులను నిర్వహిస్తన్న ప్రైవేట్ రంగ సంస్థ టాటా టెలీ సర్వీసెస్ రానున్న ఆరునెలల్లో మరో 500 కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయనున్నట్టుగా ప్రకటించింది. ఈ తాజా ఇన్వెస్ట్మెంట్తో కలసి రాష్ట్రంలో తాము ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తం 1600 కోట్ల రూపాయలకు చేరినట్టుగా సంస్థ ప్రకటించింది.
టాటా టెలీ సర్వీసులను కొత్త ప్రాంతాలకు విస్తరించడంతో పాటు అత్యాధునికి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా సంస్థ ప్రకటించింది. గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో టాటా టెలీ తన కార్యకలాపాలను ప్రారంభించగలిగిందని ఇప్పుడు కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా కొత్త ప్రాడక్ట్స్, సర్వీసులపై దృష్టి నిలుపుతున్నామని ఆయన టాటా టెలీ సర్వీసెస్ ఎండి ఎస్ రామకృష్ణన్ చెప్పారు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి పట్టణాలను కలుపుతూ రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుల్లైన్ వేసే ప్రతిపాదన వున్నట్టుగా ఆయన చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతిలో వచ్చే ఆరునెలల్లో తమ సర్వీసులను ప్రారంభిస్తున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు.