గాంధీభవన్ లో కర్నూలు ప్రకంపనలు
హైదరాబాద్ః కర్నూలు కాంగ్రెస్ రాజకీయం రాజధాని లోని గాంధీభవన్ ను కుదిపివేస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి కోట్లవిజయభాస్కర రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వంలో వేలాది మంది కార్యకర్తలు సోమవారం కర్నూలు నుంచి వచ్చి గాంధీ భవన్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. రెండు రోజుల కిందట కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడువిష్ణువర్థన్ రెడ్డి గాంధీభవన్ వద్దకు ప్రదర్శన నిర్వహించి కోట్లవిజయభాస్కరరెడ్డిని, ఆయన తనయుడు సూర్యప్రకాష్ రెడ్డిని, ఎఐసిసి సభ్యుడు రాంభూపాల్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసినవిషయం విదితమే.
ఆ ప్రదర్శనకు సవాలుగా సూర్యప్రకాష్ రెడ్డి వర్గం సోమవారం గాంధీభవన్ వద్ద ప్రదర్శన నిర్వహించింది. సూర్యప్రకాష్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్ల్యే శిఖామణి, కోయిలకుంట్ల ఎమ్మెల్ల్యే చల్లా రామకృష్ణారెడ్డి తదితరులు ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించారు. కనీసం కాంగ్రెస్ సభ్యుడు కూడా కానివిష్ణువర్థన్ రెడ్డిని గాంధీభవన్ లోకి ఎలా రానిచ్చారని వారు పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావును నిలదీశారు. ఎమ్మెస్సార్, వై.ఎస్. రాజశేఖర రెడ్డివిష్ణువర్ధన్ రెడ్డి జరిపిన ప్రదర్శనను ఉద్దేశించి ప్రసంగించడాన్ని కూడా వారు తప్పు పట్టారు.
ఎవరో అనామకుడు వచ్చి మాజీ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తే.... ఆయనను సమర్థిస్తూమీరు ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమంజసంఅంటూ వారు ఎమ్మెస్సార్ తో వాగ్వివాదానికి దిగారు. కోట్లపైవిష్ణువర్ధన రెడ్డి చేసిన ఫిర్యాదును ఎ.ఐ.సి.సి.కి పంపవద్దంటూ వారు పిసిసి అధ్యక్షునికి ఓ వినతి పత్రం సమర్పించారు. పిసిసి ఏ చర్య తీసుకుంటుందో చూశాక భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని, అవసరమైతే గాంధీభవన్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చుంటామని కోడుమూరు ఎమ్మెల్ల్యే శిఖామణి ఈ సందర్భంగావిలేకరుల సమావేశంలో అన్నారు.
సిడబ్ల్యూసి సభ్యుడు ఆర్.కె. ధావన్ గాంధీ భవన్ కు వచ్చిన సందర్భంగావిష్ణువర్ధన్ రెడ్డి గాంధీభవన్ ను ముట్టిడించడం వెనుక ఏదో కుట్రవున్నదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిశీలిస్తామని మాత్రం ఎమ్మెస్సార్ సూర్యప్రకాష్ రెడ్డి వర్గీయులకు హామీ ఇచ్చారు. మొత్తంమీద ఈ వ్యవహారం కాంగ్రెస్ లో పెనుదుమారం రేపుతున్నది.












Click it and Unblock the Notifications