పత్తి రైతులకు శుభవార్త.. ఈ జిల్లాలలో ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం పత్తి సాగుచేసే రైతులకు శుభవార్త చెప్పింది. జాతీయస్థాయి పత్తి ఉత్పాదకత పథకం క్రింద నోటిఫైడ్ బిటి హైబ్రిడ్ కాటన్ విత్తనాలను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఉచిత పత్తి విత్తనాలను ఇచ్చి ఖర్చు తగ్గించడమే కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
19 జిల్లాలలోని రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలు
జాతీయ స్థాయి పత్తి ఉత్పాదకత పథకం కింద నోటిఫైడ్ బిటి హైబ్రిడ్ కాటన్ విత్తనాలను 19 జిల్లాలలోని రైతులకు ఉచితంగా అందచేయడం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40% భాగస్వామ్యంతో మొత్తం 57.02 కోట్ల సబ్సిడీని అందిస్తోంది. విత్తనాలతో పాటు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు, మరియు వేప నూనె వంటి సహజ మందులను కూడా రాయితీ ధరల్లో రైతులకు అందించనుంది.

50 వేల 950 మంది రైతులకు 6.33 లక్షల ప్యాకెట్ల పత్తి సీడ్స్ పంపిణీ
ఇది పత్తి పంటల దిగుబడి పెరిగేలా, తెగులు నియంత్రణలోనూ సహాయపడుతుంది. రాష్ట్ర విత్తన సరఫరా సంస్థ ద్వారా ఈ పంపిణీ జరుగుతుంది. ప్రతి రైతుకు గరిష్టంగా 2.5 ఎకరాల వరకు విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 1,27,374 ఎకరాలకు సంబంధించి 50 వేల 950 మంది రైతులకు 6.33 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలను పంపిణీ చేయనున్నారు.
ఈ జిల్లాలలో రైతు వేదికల వద్ద ఉచిత పత్తి సీడ్స్
హైదరాబాద్లోని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమీషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి లాంటి అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, జనగామ, వరంగల్, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలోని రైతువేదికల వద్ద ఈరోజు నుంచి విత్తనాలు అందుబాటులో ఉంటాయి.
రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి, ఆదాయ వృద్ధి
కాబట్టి రైతుల సమీప రైతువేదికల నుండి ఈ విత్తనాలు తీసుకోవచ్చు. పత్తివిత్తనాలు ఉచితంగా ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు కొంత తగ్గుతుంది. ఈ చర్యవల్ల పత్తిసాగు విస్తరించి, రైతుల ఆర్థికస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ప్రభుత్వం రైతుసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తం అవుతుంది. ఈ పథకం ద్వారా రైతుల పత్తి ఉత్పాదకత పెరిగి, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా కావలసిన ప్రోత్సాహం లభిస్తుంది.













Click it and Unblock the Notifications