మహిళా మోర్చా పదవికివిజయశాంతి రాజీనామా
చెన్నై: బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సినీనటివిజయశాంతి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆమె బిజెపి జాతీయాధ్యక్షుడు జనా కృష్ణమూర్తికి పంపించారు. బిజెపి మిత్రపక్షమైన డిఎంకె ఈ నెల 12వ తేదీన నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అవమానించిన తీరును తాను భరించలేకపోతున్నానని,అందుకే పదవికి రాజీనామా చేశానని ఆమె చెప్పారు. అన్నాడియంకెలో చేరుతారా అని ప్రశ్నిస్తే బిజెపిలో కొనసాగుతానని ఆమె సమాధానమిచ్చారు.
ఆందోళనకారులు జయలలితకు, మాజీ గవర్నర్ ఫాతిమా బీవీకి వ్యతిరేకంగా దూషణలతో కూడిని నినాదాలు ఇచ్చారని, అసభ్య పదజాలం వాడారని, మహిళా పోలీసులను కూడా అసభ్య పదజాలంతో దూషించారని ఆమె అన్నారు. తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆమె అన్నారు. తాను పార్టీలో చేరింది మహిళల ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని కాపాడడానికేనని ఆమె అన్నారు. ర్యాలీ సందర్భంగా డిఎంకె నాయకులు, కార్యకర్తలు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలలు వంచుకునేలా వుందని, వారి పోకడ యావత్తు మహిళా లోకం ఆవేదనతో కుంగిపోయేలా వుందని ఆమెవిమర్శించారు. డిఎంకె చేపట్టిన విధానం భారతీయ సంస్కృతిని, మర్యాదలను మంట గలిపేదిగా వున్నదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.