అంగరంగ వైభవంగా టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి వేడుక.. శ్రీవారి సాక్షిగా !
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆయన కావ్యా రెడ్డిని వివాహమాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆధ్యాత్మిక వాతావరణంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఏప్రిల్ 29 రాత్రి 11.05 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య సాయి శ్రీనివాస్ మూడు ముళ్లు వేసి, జీవిత భాగస్వామిగా కావ్యా రెడ్డిని అంగీకరించారు.
ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు వంటి ప్రముఖులు నూతన దంపతులను ఆశీర్వదించడం విశేషం. సంప్రదాయ వేద పద్ధతిలో జరిగిన ఈ వివాహం ఎంతో ఘనంగా, ఆధ్యాత్మికత నిండుగా సాగింది.

పెళ్లి అనంతరం ఈ జంట ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వధూవరులు ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో మెరవనున్నారని సమాచారం.
కాగా కావ్యా రెడ్డి సినిమా రంగానికి చెందిన వారు కాకపోయినా, ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చెందినవారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల సమ్మతితో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వారి ప్రేమ కథ సింపుల్గా ప్రారంభమై, కుటుంబ పెద్దల అంగీకారంతో సంతోషకరమైన ముగింపుకు చేరుకోవడం విశేషం.
ఇక సాయి శ్రీనివాస్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన ఇప్పటికే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. రీసెంట్ గానే కిష్కింధపురి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం 'టైసన్ నాయుడు', 'హైందవ' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications