ఫీజులకు నెట్జనుల విముఖత
న్యూఢిల్లీః నిన్న మొన్నిటి వరకు ఉచిత ఇ-మెయిల్ సర్వీసు అందజేసిన ప్రముఖ పోర్టల్స్ కొన్ని అకస్మాత్తుగా ఇ-మెయిల్ సర్వీసులకు చార్జీలు విధించడాన్ని నెట్జనుల్లో అత్యధిక శాతం మంది ఖండిస్తున్నారు. ఈ సుంకాల నిర్ణయం నెట్ వినియోగంపై తీవ్ర ప్రభావాన్నే చూపిసట్టుగా చెబుతున్నారు.
బ్రాండ్క్వీవర్ నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న నెట్జనులు అనేక మంది ఉచిత ఇ మెయిల్ సర్వీసును ఎత్తివేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తొలుత ఉచిత ఇ మెయిల్ సర్వీసులతో నెట్ వినియోగాన్ని ఒక పద్దతి ప్రకారం పెంచి హఠాత్తుగా సుంకం కట్టాలనడం తమను మోసగించడమేనని 66 శాతం మందికి పైగా అభిప్రాయపడ్డారు. అయితే 34 శాతం మంది మాత్రం ఇది అనివార్యమని ఇవ్వాళ్ల కాకున్నా రేపైనా ఇంటర్నెట్ కంపెనీలు ఈ ఉచిత దుకాణాలు కట్టిపెట్టక తప్పదని అభిప్రాయపడ్డారు.
కాగా నెట్ వినియోగించకుండా ఉండటం అసాధ్యమని గత కొద్ది సంవత్సరాల్లో ఇంటర్నెట్ తమ దైనందిన జీవితంలో భాగంగా మారిందని దాదాపు అందరూ అంగీకరించారు. ఫీజు పెట్టినప్పటికీ పాత సర్వీసులనే పట్టుకువేళ్లాడాల్సిన అవసరం తమకు లేదని ఇప్పటికీ ఉచిత ఇంటర్నెట్ సేవలందిస్తున్న కంపెనీల సేవలను తాము ఉపయోగించుకుంటామని 82 శాతం మంది చెప్పారు. కేవలం 10 శాతం మంది మాత్రమే తమ ఇ- మెయిల్ ఐడి స్నేహితులు, బంధువులు, వ్యాపార, ఉద్యోగ లావాదేవాలకు సంబంధించి తాము నిత్యం సంప్రదించేవారికి బాగా అలవాటయిన కారణంగా ఫీజు చెల్లించైనా ఇప్పుడున్న సర్వీసులనే కొనసాగించే ఉద్దేశ్యంలో వున్నారు.
కాగా ఫీజు పెట్టినా ఇ మెయిల్ సర్వీసులు ఇప్పుడున్న స్థాయిలో వుంటే సరిపోతుందని ఉచిత ఇ మెయిల్ అయినప్పటికీ అనేక ఇంటర్నెట్ కంపెనీలు బ్రహ్మాండమైన సర్వీసులను అందజేశాయని 76 శాతం మంది చెప్పారు. మిగిన వారు మాత్రం ఫీజు తీసుకుంటున్నారు కనుక ఇంకా కొత్త ఫీచర్స్తో సర్వీసులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం వున్నదని అభిప్రాయపడ్డారు. సర్వే చేసిన వారిలో మెజార్టీ విద్యాధికులు, విద్యార్ధులు వున్నారు. వీరిలో 60 శాతం మందికి పైగా ఇంట్లోనే ఇంటర్నెట్ సౌకర్యం గలగివున్నారు.