విప్రో నేత సరికొత్త వ్యూహం
ముంబాయిః విప్రో బోర్డులో ఈ మధ్య కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు చేరారు. కార్పొరేట్ వ్యవహారాల్లో అది పెద్దగా పట్టించుకోదగిన విషయం కాదు. అయితే డైరెక్టర్లుగా చేరిన ఇద్దరిలో పెప్సికో ఇండియా చైర్మన్గా రిటైర్ అవుతున్న సుమన్ సిన్హా కావడంతో ఐటి రంగంలోని అందరి దృష్టి ఈ నియామకంపై పడింది. మూడేళ్ల క్రితం దేశంలోని అనేక మంది పారిశ్రామికవేత్తల్లో ఒకడుగా వున్న ప్రేమ్జీ ఐటి బూమ్ పుణ్యమా అని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
స్టాక్ మార్కెట్లో విప్రో షేరు ధర తారస్థాయికి చేరుకోవడంతో రాత్రికి రాత్రే ప్రేమ్జీ అపరకుబేరుల జాబితాలో రెండు మూడు స్థానాలకు ఎగబాకారు. మార్కెట్ పతనం తర్వాత భూమార్గం పట్టారు. అదివేరే విషయం. అయితే పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చినా, పారిశ్రామిక ప్రముఖుల్లో ఒకనిగా రాణింపులోకి వచ్చినా ఢిల్లీ అధికార ప్రాంగణంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లేకపోవడం ఆయన్ను కొంతకాలంగా భావిస్తున్నదని ఐటి వర్గాలు అంటున్నాయి. ఆర్ధిక మంత్రి సిన్హాను కలవాలన్నా, ఐటి మంత్రి ప్రమోద్మహాజన్తో భేటీ వేయాలన్నా నాస్కామ్ లేదా సిఐఐ వంటి సంఘాలను పట్టుకోక తప్పని పరిస్థితి వుండటం ఆయనకు కంటగింపుగా వుంది.
గతంలో హిందుస్తాన్ లివర్లో పనిచేసినప్పుడు, ఆ తర్వాత పెప్సికో చైర్మన్ అధికార వర్గాల్లో బ్రహ్మాండమైన లాబీలు నడిపించిన అనుభవం సుమన్ సిన్హాకు వుంది. అటు రాజకీయనాయకులు మాత్రమే కాకుండా సీనియర్ బ్యూరక్రట్లతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఈ సంబంధాలను చూసి ముచ్చటపడే భవిష్యత్తులో చాలా ఉపయోగపడే అవకాశం వున్నదని సుమన్ సిన్హాకు పిలిచి ప్రేమ్జీ పీట వేశారని అంటున్నారు.