ఆర్థిక సమస్యల అంతుచూద్దాంః వాజ్పేయి
న్యూఢిల్లీః భారత ఆర్థిక పరిస్థితి పట్ల ప్రధాని వాజ్పేయి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతో పాటు పలు ప్రపంచదేశాల ఆర్థిక పరిస్థితి నిస్తేజంగా వున్నదని, ఆ ప్రభావం భారత్ పై లేదనడం బుకాయించడమే అవుతుందని ఆయన సోమవారం జరిగిన ఆర్థిక సలహా మండలి సమావేశంల అభిప్రాయ పడ్డారు. ద్రవ్యోల్బణం తక్కువగా వుండడం, విదేశీ మారకం నిల్వలు అభిలషణీయ స్థాయిలో వుండడం, ఆహారధాన్యాల నిల్వలు పుష్కలంగా వున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ సలక్షణంగా వున్నట్లు చెప్పలేమని వాజ్పేయి అన్నారు.
పేదరికం, సాంఘిక అసమాతలు వంటి సుదీర్ఘ సమస్యలు వెన్నాడుతున్నంత వరకు భారత్ ఆర్థిక స్థితి మెరుగుపడిందని చెప్పలేమని ఆయన అభిప్రాయ పడ్డారు. స్థూల జాతీయోత్పత్తి తగ్గుముఖం పట్టడం, పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు తగ్గడం, బ్యాంకు పరపతి క్షీణించడం వంటి సమస్యలు ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నాయని వాజ్పేయి అన్నారు. అయితే నిరాశావాదంలో పడకుండా పకడ్బందీ వ్యూహంతో ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచేందుకు కృషి చేయడమే తక్షణ కర్తవ్యం అని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు వున్నప్పటికీ భారత్ ఐ.టి. కంపెనీలు చక్కని పనితీరు కనబరుస్తున్నాయని ఆయన ప్రశంసించారు. భారీ ఆహార నిల్వలు వున్నప్పటికీ నిరుపేదలకు ఆ ధాన్యాన్ని చేర్చడం ఎలా అన్నదే ప్రధాన సమస్య అని వాజ్పేయి చెప్పారు.
ఇన్నాళ్ళూ సంకీర్ణ సర్కారు కారణంగా వచ్చే తలనొప్పులు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయనిమిగిలిన రెండేళ్ళూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఆదివారం ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం అంత తేలిక కాదని, అయితే ఇకముందు తాను తీసుకోబోయే చర్యలకు ఇది అవరోధం కాదని వాజ్పేయి ధీమాగా చెప్పారు. మొన్న క్యాబినెట్ విస్తరణలోని, రెండు రోజుల కిందట జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో వాజ్పేయి మాటల ధోరణి, తెగింపు చూస్తే దారితప్పిన దేశాన్ని ఓ దరితేర్చాలని ఆయన దీక్షపట్టినట్లు కనిపిస్తున్నది. వాస్తవానికి వాజ్పేయి వంటి అనుభవజ్ఞుడైన ప్రధాని నుంచి ప్రతి భారతీయు ఆశించేది ఇదేనేమో?












Click it and Unblock the Notifications