లాడెన్ క్షేమం.... 30 మంది దుర్మరణం
ఇస్లామాబాద్ః ఆఫ్ఘనిస్తాన్ లోని అమాయక పౌరులను పొట్టనపెట్టుకుంటున్న అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆదివారం రాత్రి అమెరికాసేనలు జరిపిన దాడుల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా కనీసం 30 మంది మరణించారని పాకిస్తాన్ లో ఆఫ్ఘన్ రాయబార్ అబ్దుల్ సలామ్ జయీఫ్ వెల్లడించారు. అమాయకులపై దాడులు జరిపిన అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆయనవిమర్శించారు. .
అమెరికా వెదుకుతున్న ఒసామాబిన్ లాడెన్ క్షేమంగా వున్నాడని ఆయన చెప్పారు. లాడెన్ తో నేరుగా సంబంధాలు లేనప్పటికీ ఆయన క్షేమంగా వున్నట్లు సమాచారంఅందిందని ఆయన చెప్పారు. కేవలం టెర్రరిస్టు క్యాంపులు,మిలటరీ స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు అమెరికా ప్రపంచానికి అబద్ధాలు చెబుతున్నదని ఆయన ఆరోపించారు. అమెరికా రాకెట్లు జనావాస ప్రాంతాలను ధ్వంసం చేశాయని, కనీసం 30 మంది మరణించారని ఆయన వెల్లడించారు.
ఒక అమెరికా విమానాన్ని తాలిబన్లు కూల్చి వేశారని ఆయన చెప్పారు. అమెరికా ఇస్లాంపై యుద్ధం ప్రకటించిందని ఆయన దుయ్యబట్టారు. గతంలో రష్యా కూడా ఆఫ్ఘనిస్తాన్ పై దాడికి దిగింది. అల్లా దయవల్ల ఆ పరీక్షలో మేము నెగ్గగలిగాం అని ఆయన అన్నారు. ఆఫ్ఘన్ల శవాలమీద అమెరికా ఆనందంగా బతకాలను కుంటున్నది.... అది అంత తేలిక కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.