సీఎం విజయ్ పై అనరాని మాటలు: డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే అరెస్ట్.. !!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే మాజీ మంత్రి, తిరుచెందూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ అరెస్ట్ అయ్యారు. ఈ ఉదయం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి విజయ్పై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మద్రాస్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లిన అనిత రాధాకృష్ణన్ను ఆట్టూరు పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలీసు వాహనాన్ని ముట్టడించారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. విజయ్, టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కిందటి నెల 20న మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో అనిత రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ.. విజయ్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం ఆరు నెలలు కూడా నిలదబోదని అన్నారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన భార్య, పిల్లలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీనిపై టీవీకే నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన చేసిన ప్రసంగం తీవ్రతను పరిశీలించిన కోర్టు శుక్రవారం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. కోర్టు నుంచి ఈ ప్రతికూల తీర్పు వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులు రంగంలోకి దిగారు. అట్టూరుకు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి విచారణ నిమిత్తం ఆయనను తిరుచెందూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించారు. ఈ సాయంత్రానికి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనిత రాధాకృష్ణన్ అరెస్టును నిరసిస్తూ డీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు వ్యతిరేక నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆత్తూరు పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించి, తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జీకి దిగారు. వారిని చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications