కోటిరూపాయలు డిమాండ్ చేసిన నక్సల్స్!
హైదరాబాద్ః కేంద్ర మంత్రివిద్యాసాగర్ రావు బావమరిది మార్తాండ రావును కిడ్నాప్ చేసిన జనశక్తి గ్రూప్ నక్సలైట్లు ఆయనను వదిలిపెట్టేందుకు కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. మార్తాండరావు కుటుంబ సభ్యులు నక్సలైట్లుతో సంప్రదిస్తున్నారని, నక్సలైట్లు సూచన మేరకే వారు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదని భావిస్తున్నారు.
మూడేళ్ళ కిందట ఈ ప్రాంతం నుంచి ముగ్గురిని కిడ్నాప్ చేసిన జనశక్తి దళం నక్సలైట్లు వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారిని చంపి వేశారు. ఈ భయంతోనే మార్తాండరావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇప్పటి వరకు ఫిర్యాదు ఇవ్వలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిస్థితిని అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్ రావు తెలిపారు.
శనివారం నాడు కూడా మార్తాండ రావు కుటుంబ సభ్యులు నక్సలైట్లతో సంప్రదింపులు జరిపారు. నక్సలైట్లు కోటి రూపాయలు డిమాండ్ చేయగా మార్తాండ రావు కుటుంబ సభ్యులు 50 లక్షల రూపాయల వరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, ఇంత వరకు ఒక నిర్ణయం జరగలేదని తెలుస్తున్నది.