ఆంధ్రలో కులవివక్షపై శంఖారావం
మెదక్ః కులవివక్ష నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం కట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెదక్ జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డి గ్రామంలో అంటరానితనం నిర్మూలన ఉద్యమానికి గురువారంశ్రీకారం చుట్టారు. అన్యాక్రాంతమైన ఎస్.సి, ఎస్.టిల భూములను వారికి తిరిగి ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు. దళితులపై వేధింపులను నిరోధించేందుకు జస్టిస్ పున్నయ్య సిఫారసులకు అనుగుణంగా ఎస్.సి, ఎస్.టి కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెద్దారెడ్డి గ్రామంలోని తుల్జారాం ఆలయంలోకి దళితులు ప్రవేశించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు చర్చిలో ప్రార్థనలు జరిపారు. దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కులవివక్ష రూపుమాసే వరకువిశ్రమంచమని ప్రజల చేత ప్రమాణం చేయించారు.
మూడురోజుల పాటు అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రావతరణ దినోత్సవాలు జరుగుతున్న గురువారం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అవతరణ దినోత్సవాలకంటే ఘనంగా కులనిర్మూలన కార్యక్రమాలు జరిగాయి. కొన్ని జిల్లాలలో జిల్లాకు చెందిన మంత్రులు, మరికొన్ని చోట్ల జిల్లా కలెక్టర్లు కురవివక్ష నిర్మూల కార్యక్రమాలు నిర్వహించారు.