దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి: వాజ్పేయి
పాట్నా: భారత, పాక్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి నెలకొని వుందని ప్రధాని వాజ్పేయి అన్నారు. ఈ పరిస్థితిల్లో సాయుధ బలగాల మనో స్థయిర్యాన్నిదెబ్బ తీసే విధంగా భద్రతా సంబంధాల వివాదాలను లేవనెత్తవద్దని ఆయన ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. పాకిస్థాన్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ద్వైపాక్షిక చర్చలకు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉభయ పక్షాల మధ్య చర్చలు జరిగితే గనుక మనం ప్రస్తావించేఅంశం పాక్ ఆక్రమిత కాశ్మీరేనని ఆయన అన్నారు.
ఆయన ఆదివారంనాడిక్కడ మూడు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. గంగానదిపైరైల్వే వంతెన నిర్మాణ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు.విలేకరులతో కూడా మాట్లాడారు. రాజకీయాల, రాజకీయ కారణాలపేరుతో దేశ భద్రతను తక్కువ చేయవద్దని ఆయన అన్నారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో వుందని, అప్రకటిత ఎమర్జెన్సీ తరహా పరిస్థితి వుందని, ఉభయ పక్షాలసేనలు కూతవేటు దూరంలో ముఖాముఖి నిలబడి వున్నాయని ఆయన అన్నారు.
పొరుగుదేశానికి ఒక సైనిక జనరల్ పాలకుడిగా వున్నాడని, ఆయనకు ప్రజాస్వామ్యంమీద నమ్మకం లేదని, అందువల్ల పాక్ పాలకులతో అర్థవంతమైన చర్చలకు అవకాశం లేదని ఆయన ప్రధాని అన్నారు. ఉగ్రవాద చర్యలకు దూరంగా వుంటామని చేసిన వాగ్దానాలకు పాకిస్థాన్ కట్టుబడి వుందా, ఈ దిశగా చర్యలు తీసుకుంటోందా అనేవిషయాలను భారత్ సునిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. చర్చలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ షరతు కాబోదని, అయితే ఎజెండాలో మాత్రం దానిదే అగ్రస్థానమని ఆయన అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపేసే వరకు సమీప భవిష్యత్తులోపాకిస్థాన్లో చర్చలకు అవకాశమే లేదని ఆయన అన్నారు.
ఖాట్మండులో ముషారఫ్తో కరచాలనం చేయడాన్ని ప్రస్తావిస్తూ- మనం గతంలో చాలాసార్లు కరచాలనం చేశాం. మనసులు కలవనంత కాలం కేవలం చేతులు కలిపితే పనులు జరుగవని ఆయనకు స్పష్టం చేశాను అని వాజ్పేయి చెప్పారు. జమ్మూ కాశ్మీర్నుకోరే హక్కు పాకిస్థాన్కు లేదని ఆయన అన్నారు.
సరిహద్దు ఉద్రిక్తతలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోఅంశం కానున్నదనడాన్ని ఆయన త్రోసిపుచ్చారు. అయోధ్యవివాదాన్ని ఏ పార్టీ కూడా ఎన్నికల అంశం చేయరాదని ఆయన సూచించారు. రెండు వర్గాల మధ్య చర్చల ద్వారానో, కోర్టు నిర్ణయం ద్వారానో ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపైనే కాదు, అంతర్జాతీయ రాజకీయాలపైనా వుంటుందని, ఎందుకంటే తాను ఈ రాష్ట్రానికి చెందినవాడినని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
