చర్చల వైఫల్యంపై ప్రజలే నిర్ణేతలు: జానారెడ్డి
సూర్యాపేట: మావోయిస్టులతో ప్రభుత్వ చర్చలు విఫలం కావడానికి బాధ్యులెవరో ప్రజలే నిర్ణయిస్తారని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. నక్సలైట్లతో చర్చల విషయంలో ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నదని ఆయన ఆదివారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరులతో అన్నారు. పౌరహక్కుల నాయకుడు కన్నాభిరాన్ ప్రకటనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
చిలుకలూరిపేట సంఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన షూటర్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియస్ మొద్దు శ్రీను ఆచూకీ తెలిపినవారికి అవార్డు ఇస్తామని ఆయన చెప్పారు. ఎక్కడున్నాడో చెప్తే మొద్దు శ్రీనును ఐదు నిమిషాల్లో అరెస్టు చేస్తామని ఆయన అన్నారు.
శాంతిభద్రతలు దెబ్బ తిన్నాయనడం సరి కాదని, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు తలో రకంగా మాట్లాడుతారని ఆయన అన్నారు. పంటను కాపడుకోవడానికి అందరూ కాపలా ఉన్నా కొన్ని పరిస్థితుల్లో పంటలకు జంతువులు, కీటకాలు, మనషుల వల్ల నష్టం జరగవచ్చునని, అంత మాత్రాన కాపలా సరిగా లేదని అంటామా అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుతామని ఆయన అన్నారు. పరిస్థితులు చక్కబడినత తర్వాతనే శాంతి చర్చల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications