వరల్డ్ కప్ కోసం టీమిండియా లెజెండ్ సెలెక్ట్ చేసిన మెరికలు- వీళ్లే ఉంటే దుమ్ము రేపుతారు
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. మంగళవారమే జట్టు కొలంబోకు చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య రెండు మ్యాచ్ ల టెస్ట్ సీరస్ జరుగనుంది. మొదటి మ్యాచ్ ఈ నెల 15వ తేదీన ఆరంభం కానుంది. గాలే దీనికి వేదిక. 23వ తేదీన రెండో మ్యాచ్ ఉంటుంది. కొలంబో స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగే సిరీస్ కావడం వల్ల దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి ఈ రెండు జట్లు కూడా.
కాగా వచ్చే ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. దీనికోసం ఇప్పటి నుంచే బీసీసీఐ సన్నాహాలు మొదలు పెట్టింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయిన నేపథ్యంలో.. జట్టు ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మెరికల్లాంటి ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త ముఖాలకూ అవకాశాలను ఇస్తోన్నారు సెలెక్టర్లు. ఇప్పుడున్న టీ20 హవా నేపథ్యంలో 50 ఓవర్ల పాటు నిలకడగా ఆడే సామర్థ్యం ఉన్నవారికి చోటు దక్కొచ్చు.

ఈ పరిస్థితుల మధ్య టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ తెర మీదికి వచ్చారు. తాజాగా వన్డే వరల్డ్ కప్ కోసం తన అంచనా మేరకు భారత జట్టును ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా నిర్వహించబోయే ఈ మెగా టోర్నీ సమయానికి సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉంటారా లేదా అనే సందిగ్ధత కొనసాగతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గవాస్కర్ ఎంపిక చేసిన ఈ 15 మంది సభ్యులతో కూడిన జట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ జట్టులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకూ చోటు కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే టీ20 ఫార్మట్ ఈ ముగ్గురూ వీడ్కోలు పలికారు. వచ్చే ఏడాది నాటికి వయసు రీత్యా వన్డేలు ఆడటం కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. వారి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని సన్నీ అభిప్రాయపడ్డారు. వీరితో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లను ఆయన ఈ జట్టులో చేర్చారు.
కొందరు యువ సంచలనాలకు స్థానం కల్పించారు గవాస్కర్. ఐపీఎల్ లో నిలకడగా రిణించిన నితీష్ కుమార్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణాలను జట్టులోకి ఎంపిక చేశారు. ఓపెనర్గా శుభ్మన్ గిల్కు అవకాశం ఇచ్చారు. వికెట్ కీపింగ్ లో కేఎల్ రాహుల్కు ప్రత్యామ్నాయంగా దూకుడుగా ఆడే ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు. బౌలింగ్ విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ లను తీసుకున్నారు. స్పిన్ బౌలింగ్ లో కుల్ దీప్ యాదవ్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వైపే మొగ్గు చూపారు.
సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన ఈ జట్టులో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్ దీప్ యాదవ్ ఉన్నారు.















Click it and Unblock the Notifications