ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తాం: బాబు
హైదరాబాద్: తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సమైక్యాంధ్రలోనే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. 610 జీవోపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జోక్యం చేసుకుంటూ చంద్రబాబు తమ పార్టీ వైఖరిని తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు.
చంద్రబాబునాయుడు జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేస్తూ చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. దీనికి తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. దీంతో కాస్తా గందరగోళం చోటు చేసుకుంది. చర్చను 610 జీవోకే పరిమితం చేయాలని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి ఆదేశించారు. చంద్రబాబు వేర్పాటువాద ఉద్యంలో పాల్గొని ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారని చెప్పడం సరి కాదని, తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నదని, జై ఆంధ్ర ఉద్యమం సమయంలో తెలుగుదేశం పార్టీ లేదని తెలుగుదేశం సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.
తాను జై ఆంధ్ర ఉద్యమంలో అరెస్టయ్యానని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు అనడాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ తాను అరెస్టయి ఉంటే రికార్డుల్లో ఉండాలి కదా అని అన్నారు. టి ఆర్యస్ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడే ఎన్నికల్లో పోటీ చేసిందని, అయితే ప్రజలు దాన్ని తిరస్కరించి సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఓటు చేశారని, సమైక్యాంద్ర వాదాన్ని ప్రజలు వ్యతిరేకించారని పౌర సరఫరాల మంత్రి, టి ఆర్యస్ నాయకుడు విజయరామారావు అన్నారు.