గన్నవరం మెగా రైల్ టెర్మినల్, విజయవాడ స్టేషన్ మూడు లైన్ల విస్తరణపై కీలక అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేస్టేషన్ల పురోభివృద్ధి పనులతో పాటు అనేక కీలక రైల్వే ప్రాజెక్ట్ లు కూడా కొనసాగుతున్నాయి. ఇండియన్ రైల్వేస్ దేశ వ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ విస్తరణా పనులు చేపట్టింది. ఈ క్రమంలో ప్రధానంగా ఏపీలోనూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా అనేక ప్రాజెక్ట్ లను అందిస్తోంది రైల్వే. తాజాగా ఏపీకి సంబంధించి మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ లో కీలక అడుగు పడింది.
విజయవాడ రైల్వే స్టేషన్పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు గన్నవరంలో మెగా రైల్ టెర్మినల్ నిర్మాణానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ టెర్మినల్ 205 రైళ్ల రాకపోకలను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో రూపొందనుంది. విజయవాడ ప్రధాన స్టేషన్లో మూడు లైన్ల విస్తరణతో కలిపి మొత్తం రూ.907 కోట్లు ఖర్చవుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు.

గన్నవరం టెర్మినల్లో 10 ప్లాట్ఫామ్లు, 10 లైన్లు నిర్మిస్తారు. కోచ్ల నిర్వహణ కోసం 4 పిట్ లైన్లు ఏర్పాటు చేస్తారు. దీనికి 143 ఎకరాల భూమి అవసరమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ స్టేషన్లో 2, 3, 4 ప్లాట్ఫామ్లకు వచ్చే లైన్లు ప్రస్తుతం పొడవు తక్కువగా ఉండటం వల్ల అక్కడ పొడవైన రైళ్లు నిలపలేకపోతున్నారు.
ఈ లైన్లను విస్తరించి 28 ఎల్హెచ్బి కోచ్లు లేదా 24 ఐసీఎఫ్ కోచ్లతో కూడిన రైళ్లను నిలిపేలా చేస్తారు. రాజధాని అమరావతిలో కూడా 120 రైళ్ల సామర్థ్యంతో మెగా కోచ్ టెర్మినల్ నిర్మించనున్నారు. ఇది కూడా ఏపీలో రాజధాని ప్రాంతంలో రైల్వే అవసరాలను తీర్చనుంది. అమరావతిలో ఏర్పాటు చేసే మెగా కోచ్ టెర్మినల్ లో 9 ప్లాట్ఫామ్లు, 9 లైన్లు, 6 పిట్ లైన్లు ఉంటాయి.
దీనికి 229 ఎకరాలు కేటాయించాలని సీఆర్డీఏకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపనున్నారు. ఈ మెగా టెర్మినళ్లు విజయవాడ రైల్వే స్టేషన్పై భారం తగ్గిస్తాయి. దీంతో రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.













Click it and Unblock the Notifications
