ఆబ్కారీ ప్రశ్న వాయిదాపై అసెంబ్లీలో రభస
హైదరాబాద్: కొత్త ఆబ్కారీ విధానంపై ప్రశ్నకు జవాబును ప్రభుత్వం వాయిదా వేయడంపై సోమవారం శాసనసభలో తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. కాంగ్రెస్ సభ్యుడి కోరిక మేరకు స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి నూతన ఆబ్కారీ విధానంపై ప్రశ్నను వాయిదా వేశారు. దీనికి తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. తెలుగుదేశం సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నూతన ఆబ్కారీ విధానంపై ప్రశ్న చాలా ముఖ్యమైందని, దాన్ని వాయిదా వేయడం సరి కాదని తెలుగుదేశం సభ్యులు వాదించారు. నూతన ఆబ్కారీ విధానంపై సభలో ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయడం లేదని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సభ మీద ప్రభుత్వానికి నమ్మకం లేదా అని తెలుగుదేశం సభ్యుడు యనమల రామకృష్ణుడు అడిగారు.
ప్రశ్నను వాయిదా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని, ప్రశ్నను వాయిదా వేయాలని సభ్యుడు కోరారని, ఆ సభ్యుడు ఎందుకు వాయిదా వేయాలని కోరారో తమకు తెలియదని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య అన్నారు.