తెలంగాణపై చెపాల్సింది చెప్పాం: కెకె
న్యూఢిల్లీ: తెలంగాణపై తాము చెప్పాల్సిందంతా చెప్పామని, కొత్తగా చెప్పేదేమీ లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. ఆయన గురువారంనాడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ముకల్ వాస్పిక్ను కలుసుకున్నారు. వారితో తాను సంస్థాగత వ్యవహారాలపై, తెలంగాణపై మాట్లాడినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తన అభిప్రాయం తనకు ఉంటుందని, ఇంకొకరి అభిప్రాయం తప్పని చెప్పలేనని, తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పుకుంటానని ఆయన అన్నారు. తెలంగాణపై తమ వైఖరిని ఎన్నికల ప్రణాళికలోనే తెలియజేశామని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని తాము, తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) తమ నాయకురాలు సోనియా గాంధీ చేతిలో పెట్టామని, ఆమె ఏకపక్ష నిర్ణయం తీసుకోలేక ఒక కమిటీని వేశారని, ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. సోనియా గాంధీ చెప్పిన మాట వింటామని ఆయన చెప్పారు.