వైయస్ది శకుని పాత్ర: మావోయిస్టు నేత ఆర్కే
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నారని సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ అలియాస్ ఆర్కే విమర్శించారు. ఈ మేరకు రామకృష్ణ పేర ఒక ప్రకటన మీడియా ప్రతినిధులకు అందింది. శాంతి జపం చేస్తూనే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఊచకోతకు పూనుకుంటోందని ఆయన అన్నారు. శాంతిచర్చలంటూనే యుద్ధతంత్రానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
పోలీసుల దాడులకు తమ ప్రతిదాడులు తప్పవని ఆయన అన్నారు. ఆహారం కోసం వెళ్లిన నిరాయుధులైన మావోయిస్టులను పట్టుకుని చంపడం, విషం పెట్టి చంపడం వంటి కొత్త యుద్ధనీతికి వైయస్ ప్రభుత్వం తెర తీసిందని, చంద్రబాబు పాలనలో మించిన అణచివేతను వైయస్ పాలన అమలు చేస్తోందని ఆయన అన్నారు. పరిటాల రవిని హత్య చేస్తే తెలుగుదేశం పార్టీ 600 బస్సులను ధ్వంసం చేసిందని, తమవారిని చంపితే తాము ధ్వంసం చేసిన బస్సులు ఏపాటివో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.