నక్సల్స్ది చేతగాని తనం: డిజిపి
మహబూబ్నగర్: అచ్చంపేట పోలీసు స్టేషన్ వద్ద పోలీసులను చంపడం నక్సలైట్ల చేతగానితనమని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ వ్యాఖ్యానించారు. నిరాయుధలైన పోలీసులను చంపడం భావ్యం కాదని ఆయన అన్నారు. స్వరణ్జిత్ సేన్ శుక్రవారంనాడు అచ్చంపేట పోలీసు స్టేషన్ను సందర్శించారు. నక్సల్స్ దాడిలో మరణించిన పోలీసుల కుటుంబాలను పరామర్శించారు.
గురవారం రాత్రి మావోయిస్టులు మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట పోలీసు స్టేషన్పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు పోలీసులు శంకరనాయక్, లక్ష్మయ్య మరణించారు. తీవ్రంగా గాయపడిన ప్రభాకరరావు హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నదని, మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. ఈ దాడికి నక్సల్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డిజిపి హెచ్చరించారు. నక్సలల్స్పై నిషేధం విధించాలా, వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని, అయితే తాము నిషేధానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. చట్టాలకు లోబడి వ్యవహరిస్తే నక్సల్స్పై కేసుల విషయంలో పునరాలోచన చేస్తామని ఆయన చెప్పారు. ప్రజల సహకారంతోనే నక్సల్స్ అణచివేత సాధ్యమని ఆయన అన్నారు. అచ్చంపేట పోలీసు స్టేషన్పై దాడి విషయంలో డిజిపి సి ఆర్పియస్పై మండిపడ్డారు.
అంతకు ముందు నక్సల్స్ దాడిలో మరణించినవారి కుటుంబాల సభ్యులు అచ్చంపేటలో ఆందోళనకు దిగారు. పోలీసు ఉద్యోగాలు చేస్తున్నవారికి పూర్తి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హోం మంత్రి కె. జానారెడ్డిపై నిరసన వ్యక్తం చేశారు.