సూరి ఒప్పుకోలు సిబిఐ కుట్ర: గోవర్ధన్ రెడ్డి
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవిని హత్య చేయించింది తానేనని మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి అంగీకరించినట్లు వార్తలు రావడం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కుట్ర అని పరిటాల రవి హత్య కేసులో నిందితుడు, విప్లవ దేశభక్త పులుల నాయకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అన్నాడు. పరిటాల రవి హత్యతో సూరికి సంబంధం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పాడు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి శుక్రవారం కోర్టు హాజరు పరిచారు. అతని రిమాండ్ను ఈ నెల 11 తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పరిటాలను తానే హత్య చేయించానని సూరి ఒప్పుకున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని గోవర్ధన్ రెడ్డి అన్నాడు. పరిటాలను హత్య చేసిన మొద్దు శ్రీను, నారాయణరెడ్డి తమ సానుభూతిపరులని, రేఖమయ్యకు కూడా తమతో సంబంధాలున్నాయని, పరిటాల హత్యలో పాల్గొన్న మిగతావారు వ్యక్తిగతంగా సూరి సానుభూతిపరులని, అంతేతప్ప హత్యతో సూరికి ఏ సంబంధమూ లేదని గోవర్ధన్ రెడ్డి అన్నాడు.
పరిటాల రవిని తానే చంపించానని, చర్లపల్లి జైలులోనే పథక రచన చేశామని, మొద్దు శ్రీను తనంటే ప్రాణమిస్తాడని, ఇప్పుడు మొద్దు శ్రీనుతో తనకు సంబంధాలు తెగిపోయాయని సూరి సిబి ఐ విచారణలో తెలిపినట్లు విశ్వసనీయ కథనాల పేర వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే, సూరికి లైడిటెక్టర్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. పరిటాల రవి హత్య కేసుతో పాటు తనపై మిగతా హత్య, కుట్ర కేసులను విచారించాలని సూరి కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఇందుకు కోర్టుకు అనుమతించినట్లు సమాచారం.