మిర్చి కొనుగోళ్లపై వైయస్కు బాబు లేఖ
హైదరాబాద్: రైతుల నుంచి మిర్చి కొనుగోళ్లకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డికి ఒక లేఖ రాసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
దిగుబడి వచ్చి నెల రోజులు గడుస్తున్నా రైతుల నుంచి మిర్చి కొనుగోళ్లకు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మిర్చి కొనుగోళ్లకు వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దించాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతుల విషయంలో ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం ముందుకు సాగడం లేదని వారు వ్యాఖ్యానించారు.