ప్రాజెక్టులవారీగా బహిరంగ చర్చకు టిడిపి సిద్ధం
హైదరాబాద్: ప్రాజెక్టులవారీగా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుంచి బహిరంగ చర్చను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధపడింది. గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చ ప్రస్తావనకు వచ్చింది.
తాగునీరు, వలసలు, కరువు సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్మించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టే ప్రజాపథం కార్యక్రమంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో నిర్ణయించారు. పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమావేశంలో చర్చించారు. తక్షణమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికలు జరిగే వరకు ఇప్పుడున్నవారినే కొనసాగించాలని కూడా డిమాండ్ చేసింది.