నక్సల్స్తో చర్చలకు సిద్ధమే, కానీ...: వైయస్
న్యూఢిల్లీ: తాము తీవ్రవాదులతో చర్చలకు సిద్ధమేనని, అయితే వారు ఆయుధాలు వీడడానికి అవసరమైన నియమాలను రూపొందించడానికి చర్చలకు రావాలని ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక ఖరారు వివరాలను ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. తెలుగు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత ఆయన ఇతర భాషల మీడియా ప్రతినిధుల ప్రశ్నలను కోరారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఒక ప్రతినిధి నక్సలైట్లతో చర్చల గురించి ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రణాళిక గురించే అడగాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే మరో మీడియా ప్రతినిధి తమకు ఆ ప్రశ్నకు సమాధానం కావాలని అడిగారు. దాంతో నక్సలైట్లతో చర్చల గురించి మాట్లాడారు.
తీవ్రవాదులతో మొదటి దశ చర్చలు జరిగాయని, రెండో విడత, మూడో విడత చర్చలు జరపడానికి కూడా తాము సిద్ధమేనని, అయితే దానికి ముందు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఏర్పడాలని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. అందుకు గాను తీవ్రవాదులు ఆయుధాలు వీడాలని తాము అంటున్నామని, చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం వద్ద తప్ప మరెవరీ వద్ద ఆయుధాలు ఉండకూడదని తాము అంటున్నామని ఆయన వివరించారు. హామీ ఇచ్చినట్లుగా కాకుండా చర్చలకు ముందస్తు షరతులు పెడుతున్నారా అని అడిగితే అదేం లేదని, తీవ్రవాదులు ఆయుధాలు వీడడానికి అవసరమైన నియమావళిని రూపొందించడానికి చర్చలు జరగాలని తాము అంటున్నామని ఆయన చెప్పారు. చర్చల విషయంలో ప్రభుత్వ వైఖరి మారిందా అని అడిగితే ఏమీ మారలేదని, తమ విధానం కచ్చితంగా ఉందని ఆయన సమాధానమిచ్చారు.
మారుమూల ప్రాంతాల అభివృద్ధికి వివిధ సంయోజన వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని, పనికి ఆహారం పథకాన్ని ఎక్కువగా ఆ ప్రాంతాల్లో అమలు చేస్తామని, తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగావకాశాలను పెంచడానికి కూడా కార్యక్రమాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. యువకులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.