అర్కే లక్ష్యంగా నల్లమలలో మళ్లీ గాలింపు
హైదరాబాద్: నల్లమల అడువులను మరోసారి పోలీసులు చుట్టుముట్టారు. సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియర్ ఆర్కేను లక్ష్యంగా చేసుకుని పోలీసులు నల్లమల అడవులను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. గతంలో కూడా రామకృష్ణను లక్ష్యంగా ఎంచుకుని పోలీసులు నల్లమల అడవులను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ స్థాయిలోని పెద్దల జోక్యంతో అప్పుడు పోలీసులు వెనక్కి తగ్గారు.
నల్లమల అడవుల్లో పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐదు జిల్లాల పోలీసులు ఈ కూంబింగ్లో పాలు పంచుకుంటున్నట్లు సమాచారం. అత్యధునాతన ఆయుధాలతో పోలీసులు నల్లమల అడవుల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే రోటీన్ పెట్రోలింగ్ మాత్రమే జరుగుతోందని కర్నూలు, ప్రకాశం జిల్లాల పోలీసు సూపరింటిండెంట్లు అంటున్నారు. అయితే రెండు వేల మంది పోలీసులు నక్సల్స్ నేతల స్థావరాన్ని చుట్టుముట్టినట్లు భావిస్తున్నారు. ఆర్కే స్థావరాన్ని కూడా పోలీసులు చుట్టుముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నల్లమల అడవ్లుని గజ్జెలకొండ వద్ద మావోయిస్టు నేతలు సమావేశమైనట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్కు పెద్ద యెత్తున పూనుకున్నారని అంటున్నారు. నల్లమల అడవుల్లో కూంబింగ్ను తక్షణమే ఆపేయాలని విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు జి. కళ్యాణ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూంబింగ్ను ఆపించాలని విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ గవర్నర్ సుశీల్ కుమార్ షిండేను కోరారు.
మావోయిస్టులు తలపెట్టిన మహబూబ్నగర్ జిల్లా బంద్ సందర్భంగా మారుమూల ప్రాంతాలకు ఆర్టీసి బస్సులను ఆపేశారు. పోలీసు స్టేషన్లకు అదనపు భద్రత కల్పించారు.