పరిటాల అనుచరుల వేటలో మొద్దు శ్రీను
అనంతపురం: తెలుగుదేశం పెనుకొండ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు నారాయణ రెడ్డి రక్త నమూనాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సేకరించింది. అందుకు గాను నారాయణ రెడ్డిని జైలు నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో నారాయణ రెడ్డి ఒక ప్రైవేట్ టీవీ చానల్ ప్రతినిధితో మాట్లాడాడు. తమ ప్రత్యేక దళాలు పరిటాల అనుచరులు చమన్, పోతుల సురేష్ల కోసం గాలిస్తున్నాయని అతను చెప్పాడు. సూరి పేరు చెప్పి ఎవరైనా చందాలు వసూలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అతను హెచ్చరించాడు. పరిటాల హత్యలో ప్రధాన షూటర్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను పరిటాల అనుచరులను చంపే పనిలో ఉన్నాడని అతను చెప్పాడు. మొద్దు శ్రీను మరో పది మందితో కలిసి పరిటాల ముఖ్య అనుచరుల కోసం ప్రయత్నిస్తున్నాడని నారాయణ రెడ్డి చెప్పాడు.
పరిటాల హత్య కేసులో లొంగిపోయినవారు, అరెస్టయినవారు మొదటి నుంచి సంచలనాత్మక ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, కనగానపల్లి మండలాధ్యక్షుడు తగరకుంట ప్రభాకర్ హత్య కేసులో అనంతపురం టూ టౌన్ పోలీసులు సూరిని తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పరిటాలను తామే హత్య చేశామని చెప్పుకుంటున్న విప్లవ దేశభక్తుల పులుల (ఆర్పీటి) నాయకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని హైదరాబాద్లోని చర్లపల్లి జైలుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గోవర్ధన్ రెడ్డి అనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నాడని సమాచారం. దాంతో జైలులోనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.