వైయస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టిన టిఆర్యస్
హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీయస్)పై మినీ జలవిద్యుత్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) శాసనసభ్యుడు మందడి సత్యనారాయణ రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో టిఆర్యస్ కూడా భాగస్వామి అనే విషయం తెలిసిందే. ఆర్డీయస్పై విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సూచించారు.
వంతెన నిర్మాణం పేరు మీద ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుండడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ప్రాజెక్టును నిలిపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి అక్కడ వంతెన అవసరం లేదని, అందువల్ల వంతెన నిర్మిస్తున్నామనే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు సుబ్బారెడ్డి వాదనలో పస లేదని ఆయన చెప్పారు. ఆర్డీయస్కు తాము పాదయాత్ర చేపట్టే ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. తాము అక్కడికి వెళ్లి చేసేది కూడా ఏమీ ఉండదని, దాన్ని ఆపించాల్సిన పని ప్రభుత్వ పరంగా జరగాల్సిందేనని ఆయన అన్నారు. ఇంతకు ముందు నిరసన తెలియజేయడానికి వెళ్లినప్పుడే కర్నూలు వాళ్లు బాంబులు వేశారని ఆయన అన్నారు.