తోటపల్లి ప్రాజెక్టుపై వాడివేడి బహిరంగ చర్చ
హైదరాబాద్: తోటపల్లి ప్రాజెక్టుపై హైదరాబాద్లోని జూబిలీహాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు చర్చ కొనసాగుతూనే ఉంది. తోటపల్లి ప్రాజెక్టుకు టెండర్ వేసే అర్హత లేదని తెలుగుదేశం ప్రతినిధి, చొప్పదండి శాసనసభ్యుడు సానా మారుతి ఆరోపించారు. అయితే ప్రభుత్వాధికారులు ఆ ఆరోపణను అంగీకరించలేదు. అర్హతలు ఉంటే రికార్డులు చూపాలని మారుతి డిమాండ్ చేశారు. రికార్డులు చూపడానికి అధికారులు నిరాకరించారు. ఫైళ్లను చూపడం ఎజెండాలో లేదని వారు చెప్పారు.
రికార్డులు చూపకుంటే న్యాయవిచారణకు ఆదేశించాలని మారుతి డిమాండ్ చేశారు. అందుకు అధికారులు ఒప్పుకోలేదు. ప్రభుత్వంపై కోపాన్ని తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టులపై చూపిస్తోందని ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొన్న అధికారులు అన్నారు. ప్రాజెక్టులపై తమకు ఏ విధమైన కోపం లేదని, తమ ప్రశ్నలకు జవాబు చెప్పలేక తప్పించుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని మారుతి అన్నారు. రికార్డులు చూపనప్పుడు చర్చకు అర్థం లేదని ఆయన అన్నారు. తమ మాట విననప్పుడు చర్చలకు ఆహ్వానించడం ఎందుకని మారుతి అధికారులను అడిగారు.
చర్చల్లో నీటిపారుదల ముఖ్యకార్యదర్శి శర్మ, మరో అధికారి సీతాపతి, తదితర అధికారులు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చను ప్రభుత్వం జూబిలీహాల్లో తోటపల్లి ప్రాజెక్టుతో ఆదివారంనాడు ప్రారంభించింది.