నేను రైతుల పక్షపాతిని: ముఖ్యమంత్రి
హైదరాబాద్: తాను రైతు పక్షపాతినని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పుకున్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి, ఉన్నతాధికారులతో రాజశేఖర్ రెడ్డి ఆదివారం వ్యవసాయ రంగంపై సమీక్ష జరిపారు.
తమ ప్రభుత్వ హయాంలో కేవలం 777 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఇందులో 646 మంది ఆత్మహత్యలకు వ్యవసాయ పరిస్థితులకు సంబంధించిన కారణాలున్నాయని ఆయన అన్నారు. గతంతో పోల్చుకుంటే రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గాయని ఆయన చెప్పారు. రైతాంగ సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, దాంతో రైతుల్లో విశ్వాసం కలిగించగలిగామని ఆయన అన్నారు. 673 మంది రైతుల ఆత్మహత్యల విషయంలో విచారణలు, తదితర పనులు పూర్తయ్యాయని, వారి కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. 162 మందికి స్వయం ఉపాధి కింద అవకాశాలు కల్పించామని ఆయన చెప్పారు.