పరిటాల కేసు: బాబును ప్రశ్నించనున్న సిబిఐ
హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కూడా విచారించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) భావిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబును విచారించనున్నట్లు తెలుస్తోంది. పరిటాల హత్య కేసులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు గురువారం ప్రశ్నించారు. తనను సిబిఐ అధికారులు గంట పాటు ప్రశ్నించారని దివాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. సిబిఐ అధికారులు మళ్లీ తనను ప్రశ్నిస్తారో, లేదో తెలియదని ఆయన అన్నారు. సిబిఐ అధికారులు తనను ఏ విధమైన మానసిక ఒత్తిడికి గురి చేయలేదని ఆయన చెప్పారు. పరిటాల హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. రవి తనకు వ్యాపార, ఆర్థిక సంబంధాలు లేవని ఆయన సిబిఐ అధికారులకు చెప్పారు.
హైదరాబాద్లోని దిల్కుషా అతిథిగృహంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి దాదాపు గంట పాటు దివాకర్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. పరిటాల రవితో ఆర్థిక సంబంధాలున్నాయా అని సిబిఐ అధికారులు తనను అడిగినట్లు దివాకర్ రెడ్డి తెలిపారు. దివాకర్ రెడ్డి విచారణతో పరిటాల హత్య కేసులో సిబిఐ అధికారులు ప్రముఖలందరినీ ప్రశ్నించినట్లయింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్. జగన్ రెడ్డిని సిబిఐ గురువారంనాడు అత్యంత రహస్యంగా విచారించింది. రాయలసీమ ఐజిని, మద్దెలచెర్వు సూరి భార్య భానుమతిని సిబిఐ ఇదివరకే ప్రశ్నించింది. పరిటాల రవి హత్య విషయంలో తనపై వచ్చిన విమర్శల గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించారని, రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు తప్పవు కదా అని తాను చెప్పానని దివాకర్ రెడ్డి చెప్పారు.