సర్పంచ్ హత్య, పియస్ పేల్చివేత, ఇద్దరి కిడ్నాప్
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధ సమయంలో రక్షణ కొనుగోళ్ల వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో రెండో అఫిడవిట్ దాఖలు చేయడంపై మంగళవారం పార్లమెంటు ఉభయసభలు అట్టుడికాయి. సభా కార్యక్రమాలు స్తంభించడంతో కార్యక్రమాలేవీ చేపట్టడానికి ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.
పోప్ జాన్పాల్కు, నలుగురు సభ్యులకు సంతాపం ప్రకటించిన తర్వాత బిజెపి సభ్యుడు వి.కె. మల్హోత్రాకు మాట్లాడేందుకు లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అవకాశం ఇచ్చారు. జార్జి ఫెర్నాండెజ్పై అఫిడవిట్ దాఖలు చేయడం మీద గొడవ చెలరేగడంతో మొదట లోక్సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. జార్జి ఫెర్నాండెజ్పై దాఖలు చేసిన రెండో అఫిడవిట్ మొదటి అఫిడవిట్కు విరుద్ధమైందని, ప్రభుత్వ చర్య అనైతికం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని మల్హోత్రా విమర్శించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నందున సోనియా గాంధీ జార్జి ఫెర్నాండెజ్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. దీనికి అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
మొదటి అఫిడవిట్కు, రెండో అఫిడవిట్కు మధ్య ఏ విధమైన వైరుధ్యం లేదని, అంతా చట్టప్రకారమే చేశామని రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఈ విషయంపై తాము పూర్తి స్థాయి చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సద్దుమణగకపోవడంతో రేపటికి వాయిదా వేశారు.
ఇదే విషయంపై రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీంతో రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.