మెడికల్ పిజి డిప్లమా అడ్మిషన్లు చెల్లవు: హైకోర్టు
హైదరాబాద్: ఎన్టీ ఆర్ వైద్య విశ్వవిద్యాలయం మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల ప్రక్రియను రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది. పిజి డిప్లమా కోర్సుల అడ్మిషన్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎం ఎస్ నెంబర్ 44ను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పటి వరకు జరిపిన అడ్మిషన్లు, కౌన్సెలింగ్ చెల్లబోవని హైకోర్టు స్పష్టం చేసింది.
అడ్మిషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ కొంత మంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు ధర్మాసనం గురువారం తన తీర్పును వెలువరించింది. పిజి డిప్లమా కోర్సుల అడ్మిషన్లకు రూపొందించిన నియమనిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు తీర్పుతో విజయవాడలోని ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటి అధికారులు తలలు పట్టుకున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమనిబంధనల ప్రకారం మే ఒకటవ తేదీ కల్లా తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. హైకోర్టు తీర్పుతో ఇప్పటి వరకు జరిపిన అడ్మిషన్లన్నీ రద్దవుతాయి. తిరిగి అడ్మిషన్లు జరపడానికి సమయం సరిపోదనే ఆందోళనతో వారున్నారు.












Click it and Unblock the Notifications
