డిజిపిపై చర్యకు సిపియం, బిజెపి డిమాండ్
హైదరాబాద్: శిశు విక్రయాల కేసులో అనుచితంగా ప్రవర్తిస్తున్న పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్పై చర్య తీసుకోవాలని సిపియం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) విడివిడిగా డిమాండ్ చేశాయి. ఐ ఎయస్ అధికారి శాలిని మిశ్రాపై కేసు పెట్టడం, తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని, తప్పు చేసినవారిపై చర్య తీసుకోవాలని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శిశు విక్రయాల కేసుకు సంబంధించిన వ్యవహారాలు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, హోం మంత్రి కె. జానారెడ్డికి తెలిసే జరుగుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేపడుతామని రాఘవులు చెప్పారు. రాష్ట్రంలో నీటికి కటకట ఉందని, మిరి పొగాకు రైతులు గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాలపై, భూమి పంపిణీపై ఉద్యమం చేపడుతామని కూడా ఆయన చెప్పారు.
శిశు విక్రయాల కేసు కోర్టు విచారణలో ఉండగా డిజిపి స్వరణ్ జిత్ సేన్ జోక్యం చేసుకుంటున్నారని బిజెపి సీనియర్ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ విమర్శించారు. తాను డిజిపి భార్య అనితాసేన్ గురించి ఏమీ మాట్లాడడం లేదని, ఆమె డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకున్నారని, అది నడుస్తుందని, కానీ డిజిపి పద్ధతి ఈ వ్యవహారంలో సరిగా లేదని ఆయన అన్నారు. తానే తీర్పు చెప్పి, తానే శిక్ష వేసే పద్ధతిలో డిజిపి వ్వవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి స్పష్టత, అవగాహన లేవని విద్యాసాగర రావు విమర్శించారు. అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.