సిద్ధాంతాలకు నక్సల్స్ తిలోదకాలు: ఎమ్మెస్సార్
కరీంనగర్: నక్సలైట్లు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి సామాన్యులను కాల్చి చంపుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు విమర్శించారు. ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ జిల్లాకు వచ్చిన మంత్రి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నక్సలైట్ల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సామాన్యులను కాల్చి చంపడం ఏం న్యాయమని ఆయన నక్సలైట్లను అడిగారు.
చర్చలు విఫలం కావడానికి ఇరు పక్షాల వైఫల్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్ఫార్మర్ల పేరిట నక్సలైట్లు ఎవరిని పడితే వారిని చంపుతున్నారని ఆయన అంటూ ఇన్ఫార్మర్ అనే పదానికి నిర్వచనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిరాయుధులైన పోలీసులను, సామాన్యులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు. తుపాకులు చేతులున్నాయి కదా అని ఎవరిని పడితే వారిని చంపడం ఏం న్యాయమని ఆయన అడిగారు. రాజకీయ పార్టీలకు చెందిన సామాన్య కార్యకర్తలను చంపుతున్నారని ఆయన అన్నారు.