వైయస్ విజయోత్సవాలు సిగ్గుచేటు: చంద్రబాబు
హైదరాబాద్: రైతుల కష్టాలు తీర్చలేని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలతో గురువారంనాడు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించింది. వైయస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలో నినాదాలు చేశారు.
ర్యాలీని ఉద్దేశించి చంద్రబాబునాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2,900 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వ నష్టపరిహారం 750 మందికి మాత్రమే అందిందని ఆయన అన్నారు. రైతులకు ప్రైవేట్ అప్పులు పుట్టకుండా చేసి వైయస్ ప్రభుత్వం వారి కష్టాలను మరింత పెంచిందని ఆయన అన్నారు. రైతు కుటుంబాలను ఆదుకుని విజయోత్సవాలు జరుపుకోవాలని ఆయన వైయస్కు సూచించారు. రైతు కుటుంబాలతో పాటు చంద్రబాబు ధర్నాలో బైఠాయించారు.