తెలంగాణ పోరుకు పదవుల త్యాగం: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడేందుకే పార్టీ పదవులను వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు, ప్రముఖ సినీనటి విజయశాంతి స్పష్టం చేశారు. బిజెపి జాతీయ మండలి సభ్యురాలిగా, కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్న తాను వీటిలో ఒక పదవిని వదులుకోబోతున్నట్లు వచ్చిన వార్తలో నిజం లేదని ఆమె గురువారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ ఛానల్ ప్రతినిధితో అన్నారు. అన్ని పార్టీ పదవుల నుంచి తప్పుకోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని తాను పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు ఆమె తెలిపారు.
కేవలం పార్టీ సాధారణ కార్యకర్తగా తాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నానని, అందుకే పార్టీ పదవులను అన్నింటినీ వదులుకోవాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన బిజెపితోనే సాధ్యమవుతుందని ఆమె అన్నారు. తాను తెలంగాణ కోసం చేపట్టే ఉద్యమ రూపం త్వరలో తెలుస్తుందని ఆమె చెప్పారు.