సిట్టింగ్ జడ్జితో విచారణకు బాబు డిమాండ్
హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుకొండలో పోలీసు కాల్పులపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. రాయలసీమ ఐజి మీనాను, పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేయాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిపై, మంత్రి జెసి దివాకర్ రెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వసమెత్తారు. చంద్రబాబు రేపు పెనుకొండ వెళ్తున్నారు.
ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పడానికి అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగంలో మార్పులు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెనుకొండ సంఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
సంయమనం పాటించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునయుడు అంతకు ముందు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. పెనుకొండలో ఏం జరిగిందేనే కచ్చితమైన సమాచారం అందితే తప్ప ఆ సంఘటనపై తాను మాట్లాడలేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అక్కడి సంఘటనలు పార్టీ సమీక్షిస్తుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ ఆస్తులకు గానీ, ప్రైవేట్ ఆస్తులకు గానీ నష్టం కలిగించవద్దని ఆయన కోరారు. మొదట పెనుకొండలో సాధారణ పరిస్థితి నెలకొనాల్సింది ఉందని, ఆ తర్వాత ఏం జరిగిందనేది సమీక్షించుకోవచ్చునని ఆయన అన్నారు. ఆవేశాలకు లోను కావద్దని, తొందరపడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.